కోర్టు స్టే.. డిజిటల్ మీడియాకు భారీ ఊరట

Bombay HC

Bombay HC

డిజిటల్‌ మీడియాకు భారీ ఊరట కలిగించింది బాంబే హైకోర్టు.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రూల్స్‌–2021లోని కొన్ని అంశాలపై స్టే ఇచ్చింది.. ఆన్‌లైన్‌ ప్రచురణకర్తలంతా నైతిక నియమావళి, ప్రవర్తనా నియమావళి పాటించాల్సిందేనని ఐటీ రూల్స్‌లో పొందుపర్చిన సంగతి తెలిసిందే కాగా… ఈ నిబంధనలపై బాంబే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఐటీ చట్టంలోని క్లాజ్‌ 9 కింద పేర్కొన్న సబ్‌ క్లాజెస్‌ 1 అండ్‌ 3లపై స్టే విధిస్తున్నట్లు బాంబే హైకోర్టు సీజే జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.. ఈ సబ్‌క్లాజ్‌లు పిటిషనర్‌ వాక్‌ స్వాతంత్రపు హక్కును హరిస్తున్నట్లుగా ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నట్లుగా పేర్కొంది కోర్టు.. అయితే, కొత్త ఐటీ రూల్స్‌లోని నిబంధనలను సవాలు చేస్తూ లీగల్‌ న్యూస్‌ పోర్టల్‌ ‘ద లీఫ్‌లెట్‌’, జర్నలిస్టు నిఖిల్‌ వాగ్లే బాంబే హైకోర్టును ఆశ్రయించారు.. వారి పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు.. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించింది. వివాదాస్పద కొత్త ఐటీ నిబంధనల్లోని సబ్‌ క్లాజ్‌లపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది.