CM Stalin: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ.. 1974లో శ్రీలంకకు భారత్ అప్పగించిన కచ్చతీవు ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపణలు చేశారు. లోక్ సభ ఎన్నికలకు ముందు మాత్రమే బీజేపీ దీనిపై హడావుడి చేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి జైశంకర్కు సీఎం మంగళవారం లేఖ రాశారు. ఇటీవల శ్రీలంక నావికాదళం తమిళనాడుకు చెందిన భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసిన ఘటనలు భారీగా పెరిగిపోయాయని వాపోయారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం స్టాలిన్ డిమాండ్ చేశారు.
Read Also: Uttam Kumar Reddy: నేడు సూర్యాపేట నియోజకవర్గాల్లో ఉత్తమ్ కుమార్ పర్యటన..
అయితే, తమిళనాడు రాష్ట్రానికి చెందిన మత్య్సకారుల హక్కులను కాపాడండి అని విదేశాంగ మంత్రి జైశంకర్ కు రాసిన లేఖలో సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. జూలై 1వ తేదీన శ్రీలంక నేవీ 25 మంది మత్స్యకారులతో పాటు రెండు మోటరైజ్డ్ కంట్రీ క్రాఫ్ట్లు, రెండు రిజిస్టర్డ్ ఫిషింగ్ బోట్లను పట్టేసుకున్నారని తెలిపారు. తమిళనాడు మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలకు కేంద్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మోడీ ప్రభుత్వానికి సీఎం స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.