Jharkhand Election: 66 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల.. చంపై సోరెన్ ఎక్కడ్నుంచంటే..!

  • 66 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల
  • సరైకెల్లా నుంచి చంపై సోరెన్ పోటీ
Bjpreleasesfirst List

Bjpreleasesfirst List

జార్ఖండ్‌లో బీజేపీ దూకుడుగా ఉంది. శుక్రవారం పొత్తులు ఖరారు చేసుకుంది. గంటల వ్యవధిలోనే అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసేసింది. శనివారం సాయంత్రం 66 మందితో కూడిన తొలి జాబితాను కమలం పార్టీ విడుదల చేసింంది. ధన్వర్ నుంచి బీజేపీ పార్టీ రాష్ట్ర చీఫ్ బాబులాల్ మరాండీ, బోరియో నుంచి లోబిన్ హెంబ్రోమ్, జమ్‌తారా నుంచి సీతా సోరెన్, సరైకెల్లా నుంచి మాజీ సీఎం చంపై సోరెన్, చైబాసా నుంచి గీతా బల్ముచు, జగన్నాథ్‌పూర్ నుంచి గీతా కోడా, పొట్కా నుంచి మీరా ముండా పోటీ చేయనున్నారు.

శుక్రవారం జార్ఖండ్‌లో ఎన్డీఏ కూటమిలో పొత్తులు సఫలీకృతం అయ్యాయి. బీజేపీ 68 స్థానాల్లో, ఏజేఎస్‌యూ 10 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు కమలనాథులు ప్రకటించారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు జేడీయూ ఒకటి, ఎల్జేపీ రెండు స్థానాల్లో పోటీ చేయనున్నాయి.

జార్ఖండ్‌లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 13, 20 తేదీల్లో ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దె దించాలని బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి పని చేస్తున్నాయి. ఇక ఇండియా కూటమిలో కూడా పొత్తులు ఖరారయ్యాయి. కాంగ్రెస్-జేఎంఎం కలిసి 70 సీట్లు, మిత్రపక్షాలు 11 చోట్ల పోటీ చేయనున్నాయి.