Site icon NTV Telugu

Samrat chaudhary: బీహార్ కొత్త సీఎంగా బీజేపీ ఫైర్ బ్రాండ్ సామ్రాట్ చౌదరి..

Bihar New Cm

Bihar New Cm

Samrat chaudhary:  బీహార్ డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరి బీహార్ సీఎంగా పదవి చేపట్టబోతున్నారు. బీజేపీ ఫైర్ బ్రాండ్‌గా పేరున్న ఈయనే బీహార్ తదుపరి సీఎంగా ఎన్నికయ్యారు.  కొత్తగా ఎన్నికైన సీఎం ప్రమాణస్వీకారం బుధవారం(ఏప్రిల్ 15)  జరిగే అవకాశం ఉంది.  బీహార్ రాజకీయాల్లో సీఎం నితీష్ కుమార్ శకం ముగిసింది. గత రెండు దశాబ్ధాలుగా బీహార్ సీఎంగా కొనసాగుతున్న ఆయన మంగళవారం గవర్నర్‌కు తన రాజీనామా సమర్పించారు. ఇదిలా ఉంటే బీహార్‌‌తో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం సుగమమైంది.

బీహార్ శాసనసభ నాయకుడి ఎంపికకు బీజేపీ కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు అప్పగించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ సమక్షంలో పార్టీ కొత్త సీఎం ఎంపిక జరిగింది. ఇప్పటికే, బీజేపీ తన ఎమ్మెల్యేలు అందరిని పాట్నాకు రావాల్సిందిగా ఆదేశించింది. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఉన్న బీహార్ ఎమ్మెల్యేలు కూడా పాట్నాకు చేరుకున్నారు.

బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి అధికారికంగా ఎన్నికయ్యారు. ఈ రోజు జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది. ఇప్పటికే ఆయనకు, ఆయన నివాసం చుట్టూ భద్రత పెంచారు. నితీష్ కుమార్ ముఖ్య కార్యదర్శి దీపక్ కుమార్, సామ్రాట్ చౌదరిని ఆయన నివాసంలో కలిశారు. ప్రస్తుతం బీహార్ క్యాబినెట్‌లో ఈయన ఉపముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా ఉన్నారు. ఓబీసీ వర్గంలో ప్రముఖ నాయకుడిగా ఈయన ఉన్నారు. సామ్రాట్ చౌదరి నితీష్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడు. పలు సందర్భాల్లో సీఎంగా ఉన్న సమయంలో నితీష్ కుమార్ మాట్లాడుతూ.. ఇకపై అన్నీ ఈయనే చూసుకుంటాడని చెప్పారు.

ఎవరీ సామ్రాట్ చౌదరి:

తన తండ్రి బాటలో సామ్రాట్ చౌదరి రాజకీయాల్లోకి వచ్చారు. తన రాజకీయ ప్రస్థానాన్ని సమతా పార్టీ నుంచి ప్రారంభించారు. ఆ తర్వాత ఆర్జేడీల చేరారు. ఆయన ఆర్జేడీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. దీని తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీలోనే ఆయన రాజకీయంగా ఎదిగారు. 2018లో సామ్రాట్ చౌదరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత పార్టీ ఉపాధ్యక్షుడయ్యారు. 2020లో బీజేపీ నుంచి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2022లో నితీష్ కుమార్ బీజేపీతో సంబంధాలు తెంచుకుని ఆర్జేడీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో సామ్రాట్ చౌదరి రాజకీయంగా మరింత గుర్తింపు పొందారు. ఆయన శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా మారారు. 2023లో బీజేపీ బీహార్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మళ్లీ నితీష్ కుమార్ బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, మంత్రి పదవి చేపట్టారు. 2025 ఎన్నికల తర్వాత బీజేపీ+జేడీయూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపముఖ్యమంత్రితో పాటు హోంమంత్రిత్వ శాఖ చేపట్టారు. ఇప్పుడు బీహార్ తదుపరి సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

Exit mobile version