మణిపూర్ సీఎంగా బీరెన్సింగ్ సోమవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ గణేశన్ ప్రమాణం చేయించారు. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇంఫాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, త్రిపుర సీఎం బిప్లవ్కుమార్ హాజరయ్యారు. హెయ్గాంగ్ నియోజకవర్గం నుంచి బీరెన్ సింగ్ 17వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీరెన్సింగ్ వరుసగా ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాకుండా రెండోసారి మణిపూర్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
కాగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం బీరెన్ సింగ్ మీడియాతో మాట్లాడారు. మణిపూర్ రాష్ట్రాన్ని అవినీతి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాత్రి, పగలు కష్టపడతానని శపథం చేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం అన్న మాటే లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మణిపూర్ రాష్ట్రంలో బీజేపీలోని తిరుగుబాటుదారులను ఒకచోట కూర్చోబెట్టి వారితో చర్చించి సమస్యను పరిష్కరించేలా చేస్తానని కూడా బీరెన్ సింగ్ ప్రకటించారు.
