Bihar: ఇన్‌స్టాలో ప్రేమ.. పెళ్లైన గంటల్లోనే వధువు మృతి.. ఏం జరిగిందంటే..!

  • ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహం.. పెళ్లి
  • పెళ్లైన గంటల్లోనే వధువు మృతి
  • బీహార్‌లోని పూర్నియా జిల్లాలో విషాదం
Bihar

Bihar

ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహం.. ఏడాది ప్రేమ… పెళ్లి జరిగిన కొన్ని గంటలకే 19 ఏళ్ల వధువు మృతి. కొత్త జీవితం ప్రారంభించక ముందే అంతులేని విషాదం. అసలేం జరిగింది? పెళ్లైన కొన్ని గంటలకే నవ వధువు ఎందుకు చనిపోయింది. ఏం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.

బీహార్‌లోని పూర్నియా జిల్లాలో ఒక ప్రేమకథ విషాదంగా మిగిలింది. 19 ఏళ్ల యువతి తన కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. సోమవారం పూర్నియా జంక్షన్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో వారిద్దరూ వివాహం చేసుకుని భార్యాభర్తలుగా ఒకరినొకరు అంగీకరించారు. అయితే పెళ్లయిన కొన్ని గంటలకే ఆ యువతి ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు ఆ యువతి ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తు్న్నారు.

మృతురాలు అరేరియా జిల్లాలోని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బట్టర్‌బారికి చెందిన 19 ఏళ్ల మనీషా కుమారిగా గుర్తించారు. మనీషా బీఏ విద్యార్థిని.. ఆమె 20 ఏళ్ల దిల్‌ఖుష్ కుమార్‌తో సుమారు ఏడాదిగా ప్రేమలో ఉంది. అరేరియాలోని పలాసికి చెందిన దిల్‌ఖుష్ ఇంటర్మీడియట్ విద్యార్థి అని చెబుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహితులై.. క్రమంగా మాట్లాడుకుంటూ దగ్గరయ్యారు. సుమారు ఏడాది పాటు సాగిన ప్రేమ సంబంధం తర్వాత కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు.

మనీషా కుటుంబం వేరొకరితో పెళ్లి కుదిర్చినట్లు సమాచారం. ఆ సంబంధంతో మనీషా సంతోషంగా లేదు. దిల్‌ఖుష్‌తో కలిసి జీవించాలని కోరుకుంది. ఇద్దరూ ఇంటిని విడిచిపెట్టి కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఆగస్టు 10వ తేదీ సోమవారం ఉదయం సుమారు 11:30 గంటలకు దిల్‌ఖుష్ అరేరియా నుంచి మనీషాను తీసుకువెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పూర్నియా జంక్షన్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్‌లో ఎలాంటి సాంప్రదాయ వివాహ తంతు జరగలేదు. దిల్‌ఖుష్ స్టేషన్ ఆవరణలోనే మనీషా నుదుటిపై సింధూరం పెట్టి ఆమెను భార్యగా ప్రకటించాడు. ఆ తర్వాత ఇద్దరూ ఆ రాత్రి స్టేషన్‌లోనే గడిపారు. దిల్‌ఖుష్ ఆ సాయంత్రం వారి పెళ్లి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. తమ కుటుంబాల ఇష్టానికి వ్యతిరేకంగా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లుగా తెలిపాడు.

అయితే సోమవారం సాయంత్రం మనీషా ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దిల్‌ఖుష్, మనీషా ప్రార్థనలు చేయడానికి రాంబాగ్‌ నుంచి సిటీ కాళీ ఆలయానికి నడుచుకుంటూ వెళ్లారు. ఆ రోజు చాలా వేడిగా ఉండటంతో మార్గమధ్యంలో మనీషాకు తీవ్రంగా కళ్లు తిరిగాయి. కొద్దిసేపటికే ఆమె పరిస్థితి విషమించడంతో దిల్‌ఖుష్ ఆమెను రోడ్డు పక్కన కూర్చోబెట్టి స్థానికుల సహాయం కోరాడు. స్థానికుల సహాయంతో మనీషాను పూర్ణియాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు ఆసుపత్రిలో మనీషాకు చికిత్స ప్రారంభించారు. కానీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మనీషా మరణవార్త రెండు కుటుంబాలలోనూ తీవ్ర ఆందోళన కలిగించింది. మనీషా సోదరుడి ప్రకారం.. ఆమె ఇంటి నుంచి అదృశ్యమైనప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతుకుతున్నారు. ఈలోగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటో చూసిన తర్వాత కుటుంబ సభ్యులు దిల్‌ఖుష్ ఇంటికి కూడా వెళ్లారు. కానీ వారిని లోపలికి అనుమతించలేదు.

సోమవారం సాయంత్రం ఆలస్యంగా దిల్‌ఖుష్ స్నేహితులు మనీషా మరణం గురించి ఆమె కుటుంబానికి తెలియజేశారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే కెహత్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరణానికి గల కచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపారు. పోలీసులు ప్రస్తుతం ఈ కేసులోని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. మనీషా ఆకస్మిక మరణం ఈ మొత్తం ఘటనను మరింత అనుమానాస్పదంగా మార్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. దిల్‌ఖుష్ కుమార్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. జంట అరేరియా నుంచి బయలుదేరినప్పటి నుండి పూర్నియా జంక్షన్‌కు చేరుకోవడం, వివాహం వరకు జరిగిన మొత్తం కాలక్రమాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిటీ కాళీ ఆలయం సమీపంలో మనీషా ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం.. ఆసుపత్రిలో ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక విడుదలైన తర్వాతే మనీషా మరణానికి గల కచ్చితమైన కారణం స్పష్టమవుతుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి పోలీసులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలకు రాకుండా అన్ని కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేస్తున్నారు.