Bharat tiwari: బీహార్‌ను కుదిపేస్తున్న భరత్ తివారీ ఎన్‌కౌంటర్.. పోలీసులపై ఎఫ్ఐఆర్.

  • బీహార్‌లో సంచలనంగా మారిన భరత్ తివారీ ఎన్‌కౌంటర్..
  • ఘటనలో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు..
Bharat Tiwari

Bharat Tiwari

Bharat tiwari: బీహార్ రాజకీయాలను ‘‘భరత్ తివారీ ఎన్‌కౌంటర్’’ కుదిపేస్తోంది. భోజ్‌పూర్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న జగదీష్‌పూర్ ఎస్‌డిపీఓ, షాహ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్‌తో పాటు పలువురు పోలీసు సిబ్బందిపై షాహ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదులు, ఎన్‌కౌంటర్‌పై అనుమానం వ్యక్తం చేయడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. తివారీ ఎన్‌కౌంటర్‌పై కుటుంబ సభ్యులతో పాటు స్థానిక గ్రామస్తులు పోలీసుల వాదనల్ని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశాలు వెలువడ్డాయి.

భరత్ తివారీ మరణించిన వారం తర్వాత కుటుంబ సభ్యులు దీనిని బూటకపు ఎన్‌కౌంటర్‌గా అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన న్యాయ విచారణపై తమకు నమ్మకం లేదని వారు చెబుతున్నారు. న్యాయం జరగకపోతే సామూహిత ఆత్మహత్యకు పాల్పడుతామని కుటుంబీకులు హెచ్చరిస్తున్నారు. మృతుడి సోదరుడు చందన్ తివారీ మాట్లాడుతూ.. కేవలం విచారణ మాత్రమే కాదని, దోషులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం కవాలని డిమాండ్ చేశారు. ఈ కేసుపై సీబీఐ విచారణ జరపాలని పాట్నా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది.

×
×
Ad

భోజ్‌పూర్ జిల్లా షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలౌటి గ్రామానికి చెందిన భరత్ తివారీ గ్రామంలోని రోడ్ల దుస్థితి, స్థానిక అవినీతిపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించేవారు. అయితే, జూన్ 17 స్థానిక పోలీసులతో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ అతడిని చుట్టుముట్టింది. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో అతడి మోకాళ్లు, తొడ భాగంలో నాలుగు బుల్లెట్లు దిగి, పాట్నా మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. భరత్ తివారీ తమపై కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు పోలీులు చెబుతున్నారు.