Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు కోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్‌ తిరస్కరణ

  • ప్రజ్వల్‌ రేవణ్ణ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన బెంగళూరు ప్రత్యేక కోర్టు
  • ఇంటి పనిమనిషిపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసు
Prajwal Revanna

Prajwal Revanna

Prajwal Revanna: లైంగిక దాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జనతాదళ్-సెక్యులర్ నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణ బెయిల్ పిటిషన్‌ను కర్ణాటకలోని బెంగళూరులోని ప్రత్యేక ప్రజాప్రతినిధి కోర్టు బుధవారం తిరస్కరించింది. ప్రజ్వల్‌ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి హెచ్‌డి రేవణ్ణపై కర్ణాటకలోని హోలెనరసిపురా పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (SPP) ఈ కేసులో ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచార ఆరోపణలు) జోడించబడిందని, నేరం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, బెయిల్ మంజూరు చేయరాదని వాదించారు.

Read Also: Asaduddin Owaisi: అసదుద్దీన్‌ ఒవైసీపై అనర్హత వేటు వేయాలి.. రాష్ట్రపతికి న్యాయవాది లేఖ

ఏప్రిల్ 28 న నమోదైన ఈ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ వారి ఇంటి పనిమనిషిపై లైంగిక వేధింపుల ఆరోపణలను కలిగి ఉన్నారు. ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపులు, వేధింపుల కేసులను విచారిస్తున్న కర్ణాటక పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జూన్ 25న ఆయనపై నాలుగో కేసు నమోదు చేసింది.నాల్గవ కేసు బాధితురాలిపై లైంగిక వేధింపులు, వేధింపులు, క్రిమినల్ బెదిరింపులతో పాటు, బాధితురాలి చిత్రాలను రహస్యంగా రికార్డ్ చేయడం, షేర్ చేయడం వంటి సెక్షన్ల కింద నమోదు చేయబడింది. ఎఫ్‌ఐఆర్‌లో హాసన్‌లోని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రీతమ్‌గౌడతో సహా మరో ముగ్గురి పేర్లు ఉన్నాయి. నిందితులు ప్రీతం గౌడ, కిరణ్, శరత్‌లు వీడియో కాల్‌లో బాధితురాలిని లైంగికంగా వేధించిన సమయంలో ప్రజ్వల్ రేవణ్ణ రికార్డ్ చేసిన చిత్రాలను పంచుకున్నట్లు ఆరోపణలు వచ్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రజ్వల్ రేవణ్ణ చేసిన లైంగిక వేధింపులను రికార్డ్ చేయడంతో పాటు మరికొందరు చేసిన పనులు తన కుటుంబ సభ్యులందరినీ ఇబ్బంది పెట్టాయని ఫిర్యాదుదారు తెలిపారు.

నాల్గవ ఎఫ్ఐఆర్ ఐపీఎస్ సెక్షన్లు 354A, 354D , 354B, 506, 66 E కింద నమోదు చేయబడింది. ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ దేశం నుంచి దాదాపు ఒక నెల తరువాత భారతదేశానికి తిరిగి వచ్చాడు. ప్రజ్వల్ రేవణ్ణ ప్రమేయం ఉన్నట్టు చెబుతున్న లైంగిక దాడుల వీడియోలు 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు వెలుగులోకి రావడం ఒక్కసారిగా సంచలనమైంది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం ‘సిట్’ను ఏర్పాటు చేయగా, అప్పటికే జర్మనీ పారిపోయిన ప్రజ్వల్ సిట్ చర్యలతో దిగొచ్చారు. సిట్ విజ్ఞప్తితో బ్లూ కార్నర్ నోటీసును ఇంటర్‌పోల్ జారీ చేసింది. ఈ క్రమలో మే 31న విచారణ కోసం జర్మనీ నుంచి తిరిగొచ్చిన ప్రజ్వల్‌ను సిట్ అదుపులోనికి తీసుకుంది.