Baba Siddique Murder: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిక్ని ముంబైలోని బాంద్రాలో కాల్చి చంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా రాజకీయంగా సంచలనంగా మారింది. తామే ఈ హత్యకు పాల్పడినట్లు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే, ఈ కేసులో ఘటన జరిగిన వెంటనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ముగ్గురు షూటర్లలో ర్మైల్ సింగ్, ధర్మరాజ్ కశ్యప్లను అరెస్టు చేయగా, శివకుమార్ గౌతమ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నాలుగో నిందితుడు హరీష్ కుమార్ బలక్రమ్ నిసాద్ను సోమవారం ఉత్తరప్రదేశ్లో అరెస్టు చేసి నిన్న ముంబైకి తీసుకువచ్చారు.
Read Also: Nayab Singh Saini: హర్యానా బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నేతగా నయాజ్ సింగ్ సైనీ.. రేపు సీఎంగా ప్రమాణం..
ఇదిలా ఉంటే, ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుర్లాలో అద్దె ఇంట్లో ఉన్న సమయంలోనే షూటర్లు గన్ కాల్చడం ప్రాక్టీస్ చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ‘‘యూట్యూబ్’’ వీడియోలు చూపసి తుపాకీ కాల్చడం గురించి నేర్చుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. షూటింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఖాళీ స్థలం లేకపోవడంతో నిందితులు దాదాపుగా నాలుగు వారాలు పాటు ఈ వీడియోను చూస్తూ ఆయుధాలను ఎలా లోడ్ చేయాలి, అన్ లోడ్ చేయాలో నేర్చుకున్నారు.
సింగ్, కశ్యప్ని విచారిస్తున్న సమయంలో ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ కీలక విషయాలను రాబట్టింది. శివకుమార్ గౌతమ్కి ఆయుధాలు వినియోగించడంలో అనుభవం ఉండటంతో ఆయడిని మెయిన్ షూటర్గా నియమించుకున్నట్లు తెలుస్తోంది. గౌతమ్, సింగ్-కశ్యప్లకు కుర్లాలోని వారి నివాసంలో ‘‘డ్రై ప్రాక్టీస్’’ ద్వారా బుల్లెట్స్ కాల్చడంలో శిక్షణ ఇచ్చినట్లు తెలిసింది. పూర్తిగా నేర్చుకునేందుకు షూటర్లు యూట్యూబ్ వీడియోలను చూశారని, నిఘాకు దొరకకుండా ఇన్స్టాగ్రామ్, స్నాప్ చాట్స్ ద్వారా మాట్లాడుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం శివకుమార్ గౌతమ్తో పాటు సూత్రధారి మహ్మద్ జీషన్ అక్తర్లను అరెస్ట్ చేయడానికి సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది.