విమాన ఇంధనంలో ఇథనాల్ను కలపాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందన్న ప్రచారాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పూర్తిగా ఖండించింది. ఈ తరహా వార్తలు పూర్తిగా అవాస్తవమని, బాధ్యతారాహిత్యంతో ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రం ఈ వివరణ ఇచ్చింది.
కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. వాణిజ్య విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)లో ఇథనాల్ కలపాలనే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర అసలు లేదని స్పష్టం చేశారు. ‘‘విమాన ఇంధనంలో ఇథనాల్ కలపాలని ప్రభుత్వం యోచిస్తోందన్న ప్రచారం పూర్తిగా తప్పుడు, బాధ్యతారాహిత్యమైనది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదు.’’ అని మంత్రి తెలిపారు. విమాన ఇంధనానికి ఇథనాల్ను అనుసంధానం చేస్తూ వస్తున్న ప్రచారాన్ని నిజమని నమ్మవద్దని ప్రజలకు సూచించారు.
ఇథనాల్, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (SAF) రెండూ ఒకటే కాదని మంత్రి స్పష్టం చేశారు. ఇవి పూర్తిగా వేర్వేరు ఇంధనాలేనని తెలిపారు. సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విమాన ఇంధనమని, దీనికి అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఆమోదం ఉందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక విమానయాన సంస్థలు, విమానయాన నియంత్రణ సంస్థలు ఇప్పటికే SAF వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయని వివరించారు. ఇథనాల్కు భిన్నంగా SAF ప్రత్యేకంగా విమానాల కోసం అభివృద్ధి చేసిన ఇంధనమని, వాణిజ్య వినియోగానికి అనుమతి ఇచ్చే ముందు కఠినమైన పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.
విమానాల్లో ఉపయోగించే ప్రతి ఇంధనం కఠినమైన అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి తెలిపారు. సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ కూడా విస్తృత స్థాయి పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే వినియోగానికి అనుమతి పొందుతుందని చెప్పారు. విమాన భద్రత ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న ప్రమాణాల ఆధారంగానే కొనసాగుతుందని, విమానయాన సంస్థలు ఉపయోగించే ఇంధనాలన్నీ ఆ ప్రమాణాలకు అనుగుణంగానే ఉండాలని స్పష్టం చేశారు.
విమాన భద్రతకు సంబంధించిన తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని, అలాంటి అసత్య సమాచారం ప్రయాణికుల్లో అనవసర ఆందోళనకు కారణమవుతుందని కేంద్ర మంత్రి అన్నారు. ప్రయాణికుల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పునరుద్ఘాటించారు. విమాన ఇంధనానికి సంబంధించిన ప్రతి నిర్ణయం అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలు, శాస్త్రీయ పరిశీలన ఆధారంగానే తీసుకుంటామని స్పష్టం చేశారు.

