Vijay Dhamu: తమిళనాడు ఎన్నికల చరిత్రలో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఒక్కొక్కటిగా బయటికి వస్తూ జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మనం సాధారణంగా చాలా సినిమాల్లో ఒక సామ్యానుడు పెద్ద రాజకీయ నాయకుడిని ఎన్నికల్లో ఓడించడం చూసి ఉంటాం.. కానీ ఈ సంఘటన నిజ జీవితంలో జరిగిందంటే ఎవరైనా నమ్ముతారా.. కానీ ఇది నిజంగా జరిగింది. ఈ రోజు వెలువడిన తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో ఈ ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. వెండితెరపై దళపతి విజయ్ ఎన్నో సినిమాల్లో సామాన్యుల పక్షాన పోరాడటం చూశాం.. కానీ ఇప్పుడు ఆయన పార్టీకి చెందిన ఒక ఆటో డ్రైవర్ రియల్ లైఫ్లో ‘జెయింట్ కిల్లర్’గా మారి రాజకీయ దిగ్గజాలనే గడగడలాడించారు. రాయపురం నియోజకవర్గంలో తమిళగ వెట్రి కళగం (TVK) తరపున పోటీ చేసిన ఆటో డ్రైవర్ కె.విజయ్ ధాము, రాజకీయ ఉద్దండులను ఓడించి అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు.
దిగ్గజాలనే ఓడించి..
రాయపురం అంటే ఏఐఏడీఎంకే (AIADMK) సీనియర్ నేత, మాజీ మంత్రి డి.జయకుమార్కు కంచుకోట. 1991 నుంచి అక్కడ ఆయనదే హవా. అటువంటి నేతను విజయ్ ధాము మూడో స్థానానికి నెట్టేయడం విశేషం. ఈ ఎన్నికల్లో విజయ్ ధాము 55,000 పైచిలుకు ఓట్లు సాధించి, 14,000 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. DMK తరుఫున బరిలో నిలిచిన సుబైర్ ఖాన్ రెండో స్థానంలో నిలిచారు. AIADMK తరుఫున పోటీలో నిలిచిన జయకుమార్ కేవలం 18,000 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.
అభిమాని నుంచి ఎమ్మెల్యే వరకు..
విజయ్ ధాము గత కొంతకాలంగా ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ (అభిమాన సంఘం)లో చురుగ్గా పనిచేస్తున్నారు. అభ్యర్థుల ప్రకటన సమయంలో పార్టీ అధినేత విజయ్ను హత్తుకుని ధాము కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ భావోద్వేగమే నేడు రాయపురం ఓటర్లను కదిలించింది. “మేము కొత్త వాళ్లం కావచ్చు, కానీ ఇన్నేళ్లుగా అభిమాన సంఘాల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యే ఉన్నాం” అని ధాము తన ప్రచారంలో చెప్పుకొచ్చారు. ప్రతి నియోజకవర్గంలోనూ అభ్యర్థి కంటే తన ముఖమే ప్రధానంగా కనిపించేలా విజయ్ ప్రచారాన్ని రూపొందించారు. దీనికి తోడు ధాము తన మేనిఫెస్టోలో మత్స్యకార సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలు ఓటర్లను విపరీతంగా ఆకర్షించాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చి కొత్త అభ్యర్థిని తెచ్చిన డీఎంకేకు, తన సొంత ఇలాకాలో పట్టు కోల్పోయిన ఏఐఏడీఎంకేకు ఈ ఫలితం పెద్ద హెచ్చరికగా మారింది. ఒక సామాన్యుడిగా ఆటో స్టాండ్ నుంచి అసెంబ్లీ వరకు విజయ్ ధాము సాగించిన ఈ ప్రయాణం, తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ తీసుకొచ్చిన ‘మార్పు’కు నిదర్శనంగా నిలిచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
