బీహార్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫలితాలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫలితాల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీంతో వేలాదిమంది అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు గయాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గయాలో ఓ రైలుకు ఆందోళనకారులు నిప్పు అంటించారు. సీబీటీ 2 పరీక్ష తేదీని నోటిఫై చేయలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. 2019లో విడుదల చేసిన నోటిఫికేషన్కు చెందిన ఫలితాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీటీ 2 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2019లో నిర్వహించిన రైల్వే పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని కోరారు.
Read Also: అవినీతి రహిత దేశాల్లో భారత్ ర్యాంక్ ఎంతో తెలుసా?
మరోవైపు ఇటీవల బీహార్లోని పలు రైల్వేస్టేషన్లలో ఆందోళనకారులు నిరసనలకు దిగడంతో పలు రైళ్ల రాకపోకలను అధికారులు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులకు, అభ్యర్థులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులపై అభ్యర్థులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ను ప్రయోగించారు. అంతేకాకుండా లాఠీఛార్జి కూడా చేయడంతో ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. 500 మంది ఆందోళనకారులపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
