Amul milk: దేశవ్యాప్తంగా సామాన్యుడి జేబుకు చిల్లు పడనుంది. ప్రముఖ డెయిరీ దిగ్గజం ‘అముల్’ పాల ధరలను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని రకాల పాలపై లీటరుకు రూ.2 మేర ధర పెంచుతున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) ప్రకటించింది. ఈ పెరిగిన ధరలు మే 14 (గురువారం) నుంచి అమల్లోకి రానున్నాయి.
పెరిగిన అముల్ పాల ధరల వివరాలు (కొత్త ధరలు):
అముల్ గోల్డ్ (ఫుల్ క్రీమ్): అర లీటర్ (500ml) ప్యాకెట్ ధర రూ.35 , లీటర్ ధర రూ.70కి చేరింది.
అముల్ తాజా (టోన్డ్ మిల్క్): అర లీటర్ ధర రూ.30, లీటర్ ధర రూ.58గా నిర్ణయించారు.
అముల్ ఆవు పాలు: 500ml ప్యాకెట్ ఇప్పుడు రూ.31కి లభిస్తుంది.
అముల్ గేదె పాలు: అర లీటర్ ప్యాకెట్ ధర రూ.38కి పెరిగింది.
ధరల పెంపునకు కారణాలు ఇవే..
ప్రధానంగా పశువుల మేత ధరలు గణనీయంగా పెరగడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని అముల్ వెల్లడించింది. మేతతో పాటు ప్యాకేజింగ్ ఖర్చులు, రవాణా (ఇంధన) వ్యయం కూడా పెరగడంతో.. పాల ఉత్పత్తి చేసే రైతులు, డెయిరీలపై భారం పడకుండా ఉండేందుకు ఈ స్వల్ప పెంపు చేపట్టినట్లు సంస్థ తెలిపింది. తాజా పెంపు వల్ల లీటరుపై దాదాపు 2.5 శాతం నుంచి 3.5 శాతం వరకు భారం పడనుంది. పాల ధరల పెంపుతో వినియోగదారులపై భారం పడినప్పటికీ, రైతులకు ఇచ్చే కొనుగోలు ధరను కూడా అముల్ పెంచింది. కిలో కొవ్వుకు ఇచ్చే ధరను రూ.30 మేర పెంచినట్లు సంస్థ తెలిపింది. ఇది గతేడాది మే (2025) నాటి ధరలతో పోలిస్తే 3.7 శాతం ఎక్కువ. కాగా అముల్ చివరిసారిగా 2025, మే 1వ తేదీన ధరలను పెంచింది. సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ అదే సమయంలో ధరల పెంపు జరగడం గమనార్హం. అముల్ బాటలోనే ఇతర ప్రైవేట్, సహకార డెయిరీ సంస్థలు కూడా ధరలను పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
