NTV Telugu Site icon

Anant-Radhika wedding: స్టార్‌ హోటళ్లకు కాసుల వర్షం.. అమాంతంగా పెంచేసిన ధరలు..!

S

S

అనంత్ అంబానీ-రాధిక పెళ్లి పుణ్యమా అంటూ ముంబైలో స్టార్ హోటళ్లకు కాసుల పంట పండబోతుంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌లు జూలై 12న మూడు ముళ్లతో ఈ జంట ఒక్కటి కాబోతుంది. అయితే ఇందుకోసం ముంబై వేదిక కాబోతుంది. ఇందుకు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ, వీవీఐపీలు అంతా ముంబైలో వాలిపోనున్నారు. అయితే అతిథుల కోసం ఇప్పటికే స్టార్ హోటళ్లు నిండిపోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఎవరైనా బుక్ చేసుకుందామంటే ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఒక్క రాత్రి బసకు సుమారు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్సులో ఉన్న ట్రైడెంట్‌, ఒబెరాయ్‌ హోటళ్ల వెబ్‌సైట్ల ప్రకారం.. జులై 10 నుంచి 14 వరకు గదులు ఖాళీగా లేవు. ఆ చుట్టుపక్కల ఉన్న హోటళ్లలో రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఒక్కరాత్రి బస చేసేందుకు రూ.13 వేల నుంచి రూ.30 వేలుగా ఉండగా.. జులై 14న రూ.40 వేలుగా కనిపిస్తోంది. మరో హోటల్‌లో 14న ఏకంగా రూ.90వేలకు పైగా ఉన్నట్లు సమాచారం. పన్నులు కలిపి ఇది మరింత పెరుగుతుంది. జులై 10, 11 తేదీల్లో మాత్రం ఖాళీగా లేవు.

ఇది కూడా చదవండి: CNG Cars: రూ. 10 లక్షల కంటే తక్కువ ధరకు లభించే టాప్-5 సీఎన్జీ కార్లు ఇవే..!

జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జులై 12న అనంత్‌ వివాహం జరగనుండగా.. 14 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జులై 13న ‘శుభ్‌ ఆశీర్వాద్‌’, 14న మంగళ్‌ ఉత్సవ్‌ లేదా రిసెప్షన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వివాహానికి వచ్చే అతిథులు ఎక్కడ బస చేస్తారనే విషయంపై అంబానీ కుటుంబం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. మరోవైపు జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వైపు వెళ్లే మార్గాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు ముంబై ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు. జులై 12 నుంచి 15 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.

ఇది కూడా చదవండి: Bhatti Vikramarka: దశాబ్ధం ముగిసినా ప్రజల గుండెల్లో ఉన్న సీఎం వైఎస్సార్‌..