Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?

  • 1985 ఎయిర్ ఇండియ కనిష్క పేలుడు కేసును మూసివేశ దిశగా కెనడా.?
  • దర్యాప్తు బృందాన్ని తగ్గించి ‘ఇన్‌యాక్టివ్’ స్థితిలోకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.
  • 329 మంది ప్రాణాలను తీసిన ఉగ్ర సంఘటన.
Air India Kanishka Bombing

Air India Kanishka Bombing

Air India Kanishka Bombing: 1985లో 329 మంది ప్రయాణికుల్ని బలిగొన్న ఎయిర్ ఇండియా కనిష్క విమాన పేలుడు ఇప్పటి వారికి పెద్దగా పరిచయం ఉండదు. కానీ, ఈ ఘటన అప్పట్లో ఇండియా, కెనడాల్లో సంచలనంగా మారింది. విమానం ఆకాశంలో ఉండగానే బాంబు పేలుళ్లు జరిగి సముద్రంలో కూలిపోయింది. అయితే, 41 ఏళ్ల తర్వాత ఈ ఉగ్రదాడికి సంబంధించిన విచారణను కెనడా ముగించే దిశగా వెళ్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) దర్యాప్తు బృందాన్ని తగ్గించి, కేసును ‘ఇన్‌యాక్టివ్’ స్థితిలోకి తీసుకెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు బాధిత కుటుంబాలకు తెలిపినట్లు సమాచారం. అయితే, ఈ కేసును కొనసాగించేందుకు కెనడా ప్రధాని మార్క్ కార్నీకి బాధిత కుటుంబాలు విజ్ఞప్తి చేశాయి.

కెనడా కమిషన్ ఆఫ్ ఇన్‌క్వైరీ ప్రకారం, దేశభద్రతా, నిఘా వ్యవస్థల్లో అనేక వైఫల్యాలు ఈ విషాదానికి దారి తీసినట్లు చెప్పింది. సాక్షుల రక్షణ, బాంబు పేలుళ్ల తర్వాత జరిగిన దర్యాప్తు వంటి అంశాలను ఈ కమిషన్ పరిశీలించింది. ఈ కేసులో ఇందర్‌జీత్ సింగ్ రేయత్ దోషిగా తేలగా, మరో ఇద్దరు నిందితులు 2005లో నిర్దోషులుగా విడుదలయ్యారు. మరెవరిపై కూడా అభియోగాలు మోపలేదు. ఈ కేసుకు సంబంధించి కీలకమైన ఆధారాలు మాయమయ్యాయి. సాక్షుల్ని చంపడం లేదా బెదిరించడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.

ఆకాశంలోనే బాంబు దాడి.. కూలిన విమానం..

జూన్ 23, 1985 ఎయిర్ ఇండియా కనిష్క విమానం బాంబు దాడి భారత్ ఎప్పటికీ మరిచిపోలేని ఉగ్రదాడిగా మిగిలిపోయింది. ఈ ఏడాదితో ఈ ఉగ్రఘటనకు 41 ఏళ్లు. ఖలిస్తానీ ఉగ్రవాదులు కెనడా నుంచి ఇండియాకు వస్తున్న ఎయిర్ ఇండియా కనిష్క 182 విమానాన్ని బాంబులతో పేల్చేశారు. కెనడాలోని మాంట్రియల్ నుంచి లండన్, ఢిల్లీ మీదుగా ముంబై చేరాల్సిన విమానం అట్లాంటిక్ మహాసముద్రంపై కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 329 మంది మరణించారు. మొదటి స్టాప్ ఓవర్ లండన్ హీత్రూ విమానాశ్రయంలో దిగడానికి 45 నిమిషాల ముందు ఐర్లాండ్ తీరానికి 190 కి.మీ దూరంలో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కూలిపోయింది. రాడాన్ నుంచి అదృశ్యమైన వెంటనే రెస్క్యూ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, ఒక్క ప్రయాణికుడు కూడా బతకలేదు. సముద్రం నుంచి 131 మృతదేహాలను రెస్క్యూ టీం వెలికి తీసింది. విమానం 31,000 ఫీట్‌ల ఎత్తులో ఉన్న సమయంలో బాంబు పేలుడు సంభవించినట్లు తేలింది. ఈ ప్రమాదంలో 268 మంది కెనడా పౌరులు, 27 మంది బ్రిటీష్ జాతీయులు, 24 మంది భారతీయులు మరణించారు.

ఖలిస్తానీ తీవ్రవాదుల దుశ్చర్య..

ఈ ఘటనకు ఖలిస్తానీ వేర్పాటువాద గ్రూప్ ‘బబ్బర్ ఖల్సా’ పాల్పడినట్లు విచారణలో తేలింది. ఘటన జరిగిన నెల రోజుల తర్వాత ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా తల్విందర్ సింగ్ పర్మార్ వ్యవహారించినట్లు కెనడా పోలీసులు ఆరోపించారు. మరో నిందితుడు ఇందర్ జిత్ సింగ్ రేయత్ ను ఈ కేసులో అరెస్ట్ చేశారు. వీరితో పాటు రిపుదమన్ సింగ్ మాలిక్, అజైబ్ సింగ్ బగ్రీలను 2000లో అరెస్టు చేశారు. వీరిపై ఆధారాలు లేకపోవడంతో విడుదల చేశారు. ప్రపంచంలో హేయమైన ఉగ్రవాద ఘటనల్లో ఇది నిలిచింది.

2006లో, ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 బాంబు దాడిపై విచారణ జరిపేందుకు కెనడియన్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 2018లో, 1985 ఎయిర్ ఇండియా బాంబు దాడి జరిగిన 33 సంవత్సరాల తర్వాత, 329 మందికి అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బాధితులకు నివాళులు అర్పిస్తూ ఈ సంఘటనను దేశ చరిత్రలో “ఒకే అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడి”గా అభివర్ణించారు.