Abhijit Deepke: అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు.. “బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు, ముందే రాళ్లు తెచ్చుకున్నరు”

  • అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు
  • "బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు"
  • ఇంటర్నెట్ నిలిపివేతపై ప్రశ్నలు
Abhijit Deepke Protest

Abhijit Deepke Protest

పోటీ పరీక్షల అవకతవకలు, విద్యార్థుల సమస్యలపై కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే పలు సంచలన ఆరోపణలు చేశారు. నిరసనకారులపై పోలీసులు అత్యంత కఠినంగా లాఠీచార్జి చేశారని, ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. మీడియాతో మాట్లాడిన అభిజిత్ దీప్కే, శాంతియుతంగా సాగుతున్న నిరసనపై పోలీసులు బలప్రయోగం చేశారని ఆరోపించారు.

ఈ ఘటనలో బాధ్యులైన పోలీసు అధికారులపై కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. అలాగే తన నిరసన 34వ రోజుకు, సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 26వ రోజుకు చేరుకుందని తెలిపారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సోనం వాంగ్‌చుక్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన అభిజిత్ దీప్కే, ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం కలగకూడదని కోరుతూ నిరాహార దీక్షను విరమించాలని విజ్ఞప్తి చేశారు.

“బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు”

నిరసనను భంగం చేయడానికి బయటి వ్యక్తులను పంపించారని అభిజిత్ దీప్కే ఆరోపించారు. ఆరోపణల ప్రకారం.. గత నెల రోజులుగా నిరసన పూర్తిగా శాంతియుతంగా కొనసాగుతోంది. ఉద్యమానికి ప్రజల మద్దతు పెరగడంతో కొందరు ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి చెందిన కొందరు వ్యక్తులు రాళ్లు విసురుతూ, ఆ ఘటనకు సీజేపీ సభ్యులనే బాధ్యులుగా చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ముందుగానే రాళ్లు అక్కడ సేకరించి ఉంచారని, అనంతరం కొందరు వ్యక్తులు వచ్చి వాటిని విసరడం ప్రారంభించారని చెప్పారు. ఈ ఘటనలో పోలీసులు కూడా తగిన విధంగా వ్యవహరించలేదని ఆరోపించారు.

ఇంటర్నెట్ నిలిపివేతపై ప్రశ్నలు

అభిజిత్ దీప్కే సోషల్ మీడియా వేదిక Xలో చేసిన పోస్టులో నిరసన ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారని ఆరోపించారు. అయితే, ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారన్న విషయం అధికారికంగా ధృవీకరించలేదు. మరో పోస్టులో నిరసన ప్రాంతంలో మోహరించిన పోలీసులు, పారామిలిటరీ బలగాలు శాంతియుతంగా వ్యవహరించాలని, నిరసనకారులపై బలప్రయోగానికి దిగొద్దని విజ్ఞప్తి చేశారు.

ఉద్రిక్త పరిస్థితులు

పోటీ పరీక్షల వ్యవహారంపై కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు, ఉద్యమకారులు తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతుండగా, మరోవైపు పోలీసులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. అభిజిత్ దీప్కే చేసిన ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆరోపణలపై అధికారిక స్పందన రావాల్సి ఉంది.