NTV Telugu Site icon

Swati Maliwal assault: ఇదంతా బీజేపీ కుట్ర.. స్వాతి మలివాల్ కేసుపై ఆప్..

Swati Maliwal Assault

Swati Maliwal Assault

Swati Maliwal assault: ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ వ్యవహారం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ స్వాతి మలివాల్‌పై దాడి చేశాడు. దీనిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను బిభవ్ ఏడు సార్లు చెంపపై కొట్టడమే కాకుండా, సున్నిత భాగాలపై కడుపులో తన్నాడని ఆమె ఆరోపించింది. ఈ రోజు ఢిల్లీ పోలీసులు, ఫోరెన్సిక్ టీం కేజ్రీవాల్ నివాసంలో సాక్ష్యాలు సేకరించేందుకు వెళ్లింది. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ బిభవ్ కుమార్‌ని తమ ముందు హాజరుకావాలని కోరినప్పటికీ, ఈ రోజు అతను హాజరుకాలేదు, మరోసారి అతడికి ఉమెన్ ప్యానెల్ సమన్లు జారీ చేసింది.

ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై ఆప్ స్పందించింది. స్వాతి మలివాల్ బీజేపీకి బంటుగా వ్యవహరిస్తోందని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి ఆరోపించారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ముందస్తు అపాయింట్మెంట్ లేకుండానే మే 13 కేజ్రీవాల్ నివాసినికి స్వాతి మలివాల్ వచ్చారని, అక్కడే ఉన్న భద్రతా సిబ్బందిని బెదిరించారని ఆమె పేర్కొన్నారు. కేజ్రీవాల్ నివాసం నుంచి వైరల్ అయిన ఓ వీడియోను ప్రస్తావిస్తూ, అక్కడ స్వాతి మలివాల్, భద్రతా సిబ్బందితో వాదించుకోవడం కనిపించిందని అన్నారు. అయితే, ఈ వీడియో స్పష్టంగా ఉందని, స్వాతి మలివాల్ పేర్కొన్న ఎఫ్ఐఆర్ అంతా అబద్ధమని చెప్పింది.

Read Also: Swati Maliwal Case: కేజ్రీవాల్ ఇంటికి ఫోరెన్సిక్ టీమ్.. సీన్ రీకన్‌స్ట్రక్షన్

స్వాతి మలివాల్‌ని వెయిటింగ్ రూంలో వేచి ఉండాల్సిందిగా చెప్పినా కూడా ఆమె ఆగకుండా డ్రాయింగ్ రూంలోకి ప్రవేశించిందని, ఆమెను అడ్డుకునేందకు బిభవ్ కుమార్ వచ్చారని అతిషీ పేర్కొన్నారు. ఇదంతా బీజేపీ ప్లాన్ అని ఆమె ఆరోపించారు. ఆ సమయంలో కేజ్రీవాల్ ఇంటిలో లేకపోవడంతో అతనికి పెద్ద ప్రమాదం తప్పిందని ఆమె అన్నారు. కేజ్రీవాల్‌కి పెరుగుతున్న జనాదరణతో బీజేపీ పార్టీ రగిలిపోతోందని, దీంతోనే ఈ చర్యల పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు.

మరోవైపు ఈ వ్యవహారంపై బీజేపీ ఆప్‌ని టార్గెట్ చేస్తోంది. సీఎం కేజ్రీవాల్ నిందితుడు బిభవ్ కుమార్‌ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాడని బీజేపీ ఆరోపిస్తోంది. బుధవారం ముఖ్యమంత్రి నివాసం ముందు బీజేపీ మహిళా మోర్చా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. కేజ్రీవాల్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని బీజేపీ ప్రశ్నించింది. మరోవైపు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. బిభవ్ కుమార్‌తో సన్నిహిత్యం ఉన్నందుకు కేజ్రీవాల్ సిగ్గులేని వారు అని ఆమె విమర్శించారు.