Gujarat: గుజరాత్‌లో విషాదం.. గోడ కూలి ఏడుగురు మృతి

  • విజయ దశమి రోజున గుజరాత్‌లో ఘోర విషాదం
  • గోడ కూలి ఏడుగురు మృతి.. పలువురికి గాయాలు
Gujarat7died

Gujarat7died

విజయ దశమి రోజున గుజరాత్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. మెహసానా జిల్లాలోని కడి తాలూకాలోని జసల్‌పూర్ గ్రామ సమీపంలో ఒక ప్రైవేట్ కంపెనీ గోడ కూలి ఏడుగురు మరణించారని మెహసానా జిల్లా ఎస్పీ తరుణ్ దుగ్గల్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అధికార యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. శిథిలాలను తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు ఏడుగురు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. సంఘటనాస్థలిలో అంబులెన్స్‌లు సిద్ధంగా ఉన్నాయి. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేసి ఆస్పత్రికి తరలిస్తున్నారు.

ఇదిలా ఉంటే శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్లు అధికార యంత్రాంగం భావిస్తోంది. వారికోసం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంంది.

నిర్మాణంలో ఉన్న ప్రైవేట్ కంపెనీలో శనివారం మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రమాదం జరిగిందని మెహసానా జిల్లా అభివృద్ధి అధికారి డాక్టర్ హస్రత్ జాస్మిన్ తెలిపారు. సమాచారం ప్రకారం 9-10 మంది చిక్కుకున్నారని తెలిపారు. అందులో 19 ఏళ్ల యువకుడు సజీవంగా బయటపడ్డాడని చెప్పారు. ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు ఇంకా సజీవంగా ఉన్నారని తెలిపారు.