దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరు నటించిన సోషియో ఫాంటసి ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తోంది. ఎప్పుడో రిలీజ్ కావలసిన ఈ సినిమా వాయిదాలు మీదా వాయిదాలు పడుతూ వస్తోంది. తాజాగా టాలీవుడ్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాని రెండు భాగాలుగా తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. అదే కోవలో విశ్వంభరను కూడా రెండు పార్ట్స్ గా తీసుకువచ్చేందుకు ప్లానింగ్ జరుగుతోందని నెట్టింట ప్రచారం జోరందుకుంది.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, దర్శకుడు వశిష్ట స్పందించారు. రెండు పార్ట్స్ గావస్తున్న విశ్వంభర అనే ట్వీట్ కి సమాధానం ఇస్తూ “అవునా.. నిజమా?” అంటూ కాస్త వెటకారంగా అలాంటి ఆలోచన లేదని కన్ఫామ్ చేసారు. దీనిని బట్టి చూస్తుంటే రెండు భాగాల వార్తల్లో ప్రస్తుతానికి వాస్తవం లేదని సినిమా సింగిల్ పార్ట్ గానే వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినప్పటికీ భారీ స్థాయిలో ఉన్న VFX మరియు గ్రాఫిక్స్ పనుల కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ పైనే ఆధారపడి ఉందని క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో చిరంజీవి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం ‘హనుమాన్’ ఫేమ్ గౌర హరిని రంగంలోకి దించినట్లు సమాచారం. మొత్తానికి ఈ ‘విశ్వంభర’ ప్రపంచం ప్రేక్షకులను సరికొత్త అనుభూతికి గురిచేయడం ఖాయంగా కనిపిస్తోంది.
