శాండిల్వుడ్ బాద్షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘విక్రాంత్ రోణ’. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ ఎంట్రీ గురించి మేకర్స్ అనౌన్స్ చేశారు. నిర్మాత జాక్ మంజునాథ్ మాట్లాడుతూ ‘‘మా సినిమాలో జాక్వలైన్ ఫెర్నాండెజ్ భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇది అభిమానులకు, ఫ్యాన్స్కు సర్ప్రైజింగ్గా, వారిని థియేటర్స్కు రప్పించేలా ఉంటుంది. జాక్వలైన్ చాలా ప్రొఫెషనల్ నటి. కచ్చితమైన సమయానికి షూటింగ్కు వచ్చేవారు. ఉదయం 9 గంటలకు సెట్స్కు వచ్చి రాత్రి 9.30 నిమిషాలకు వరకు ఉండేవారు. షూటింగ్కు వచ్చే ముందు ఆమెకు సంబంధించిన డైలాగ్స్ను రిహార్సల్ చేసి వచ్చేవారు. చాలా డేడికేషన్తో వర్క్ను పూర్తి చేశారు. ఆమె పాత్రకు ఆమే డబ్బింగ్ చెప్పబోతున్నారు’’ అని అన్నారు.
జాక్వలైన్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ ”ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. ఈ ప్రపంచానికి ప్రత్యేకమైన భారతీయ కథను ఈ సినిమా ద్వారా తెలియజేయబోతున్నారు. భారీ రేంజ్లో రూపొందుతోన్న యాక్షన్ అడ్వెంచర్ మూవీలో నేను భాగం కావడం హ్యాపీగా ఉంది” అని చెప్పారు. హీరో సుదీప్ మాట్లాడుతూ ‘‘మేం సినిమాను ఎలాంటి ఉత్తేజంతో స్టార్ట్ చేశామో అదే ఉత్తేజంతో పూర్తి చేయాలనుకుటున్నాం. మా ఎంటైర్ టీమ్ పాజిటివ్ దృక్పథంతో ముందుకెళుతుంది. అలాగే ఈ సినిమాలో భాగమై పాట, సినిమా సహా మా అందరిలో ఓ ఎనర్జీకి కారణమైన జాక్వలైన్కు ధన్యవాదాలు. ఆమె డాన్స్ నాలోని ఎనర్జీని రెట్టింపు చేసింది’’ అని అన్నారు.
జాక్విలిన్ పై చిత్రీకరించిన ప్రత్యేక గీతం కోసం భారీ సెట్ ను వేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటలో 300 మంది డాన్సర్స్ పాల్గొన్నారు. ఆమె నర్తించిన పాటను, సన్నివేశాలను ఆరు రోజుల పాటు చిత్రీకరించారు. ఇందు కోసం నిర్మాతలు దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి జాక్విలిన్ ను ప్రత్యేక విమానంలో నిర్మాతలు తీసుకు రావడం విశేషం. అనూప్ భండారి దర్శకత్వంలో జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్ (షాలిని ఆర్ట్స్) నిర్మిస్తున్న ‘విక్రాంత్ రోణ’ త్రీడీలో 14 భాషలు, 55 దేశాల్లో విడుదల కాబోతోంది.
