Trikala OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన శ్రద్ధా దాస్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Trikala

Trikala

Trikala OTT: థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టిన ‘త్రికాల – ది స్క్రిప్ట్ ఆఫ్ గాడ్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కూడా జడిపించేందుకు సిద్ధమైంది. 2026 మే 28న థియేటర్లలో విడుదలైన ఈ తెలుగు అతీంద్రియ థ్రిల్లర్, మిస్టరీ, సస్పెన్స్, ఫాంటసీ ఎలిమెంట్స్ తో రూపొందింది. థియేటర్లలో చూసే అవకాశం మిస్ అయిన థ్రిల్లర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఇంట్లోనే ఎంచక్కా భయాడుతూ చూసేయచ్చు. సుమారు 40 రోజుల తర్వాత ఈ సినిమా ఈ రోజు నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. సన్ నెక్ట్స్ (SunNXT) ఓటీటీ  జులై 9 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు నిన్న అనౌన్స్ కూడా చేసింది.  ‘చీకటి వేటాడటానికి సిద్ధంగా ఉంది’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌ లైన్‌తో ఈ అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించడం విశేషం. మిస్టికల్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కథ

ఈ సినిమా కథ పౌరాణిక నేపథ్యంతో కూడిన కుమారీ ఖండం నుంచి ప్రారంభమవుతుంది. ప్రపంచాన్ని వినాశనం నుంచి కాపాడేందుకు కొంతమంది మహర్షులు అత్యంత శక్తివంతమైన గ్రంథాలను దాచిపెట్టి, శక్తి ఏథ అనే దివ్య ఆయుధాన్ని సృష్టిస్తారు. ఆ ఆయుధాన్ని యోధుడు త్రికాల వర్మకు అప్పగిస్తారు. దుష్టశక్తులతో పోరాడుతూ అతను ప్రాణత్యాగం చేసినప్పటికీ, కలియుగంలో మళ్లీ చెడు శక్తులు విజృంభిస్తాయని ముందుగానే గ్రహించిన ఋషులు అతని ఆత్మను ఒక విశ్వాగ్రంలో భద్రపరుస్తారు. ప్రపంచానికి అవసరమైన సమయంలో అతను తిరిగి మేల్కొనేలా ఏర్పాట్లు చేస్తారు.

ప్రస్తుత కాలంలో కథ మూడు విభిన్న జీవితాల చుట్టూ తిరుగుతుంది. తన ప్రేయసి నిధి కోసం వెతుకుతున్న శివకు ఒక రహస్యమైన అతీంద్రియ శక్తి కలిగిన మొబైల్ ఫోన్ దొరుకుతుంది. మరోవైపు అరుదైన పోర్ఫిరియా వ్యాధితో బాధపడుతున్న వైతరణ్, విషాదకర సంఘటన తర్వాత ఒక భవనాన్ని వెంటాడే ఆత్మగా మారతాడు. తర్వాత అతడే త్రికాల వర్మ పునర్జన్మ అని వెల్లడవుతుంది. ఇదే సమయంలో మనోవైద్యురాలు మాయ ఈ విచిత్ర సంఘటనల వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఈ రహస్య ప్రపంచంలోకి అడుగుపెడుతుంది.

ఇదే సమయంలో ఒక ప్రాచీన రాక్షస రాజు తిరిగి రావడానికి ప్రయత్నిస్తుండగా, అతని శక్తిని వెలికితీయాలనే లక్ష్యంతో ఒక రహస్య తాంత్రిక వర్గం విశ్వాగ్రంధిని వెతుకుతుంది. చివరకు శివ ప్రయాణం, మాయ దర్యాప్తు, త్రికాల వర్మ పునర్జన్మ ఒకే దారిలో కలుస్తాయి. అనంతరం ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించే కాంతి, చీకటి మధ్య జరిగే పోరాటంతో కథ క్లైమాక్స్ కు చేరుతుంది.

ఈ చిత్రంలో శ్రద్ధా దాస్, మహేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించగా, అజయ్, సాహితీ అవంచ, నందా దొరైరాజ్, రోబో శంకర్, రౌడీ రోహిణి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. చిత్రానికి మణి తెల్లగూటి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించగా, షజిత్ హుమాయున్ నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు. థియేటర్లలో మిస్టరీ, ఫాంటసీ కాన్సెప్ట్‌తో ఆకట్టుకున్నఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.