The Traitors India Season 2: ట్రేటర్లే విజేతలు.. రూ.66 లక్షలు ప్రైజ్ మనీని కొట్టేసిన కిలాడి భామలు!

The Traitors India Season 2

The Traitors India Season 2

The Traitors India Season 2: రియాలిటీ షో అంటే టాస్కులు, గొడవలు, ఎమోషన్స్, ఎలిమినేషన్లు గుర్తుకొస్తాయి. కానీ ‘ది ట్రేటర్స్ ఇండియా’ మాత్రం వీటన్నింటికీ భిన్నమైన మైండ్ గేమ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక్కడ అసలు పోరాటం టాస్కుల్లో కంటే నమ్మకం, అనుమానం మధ్యే సాగుతుంది. పక్కనే ఉన్న వ్యక్తి ట్రేటరా, ఇన్నోసెంటా అనే విషయం చివరి వరకు తెలియదు. ఒకరిని ఒకరు నమ్మించుకుంటూ, అనుమానాలను మరోవైపు మళ్లిస్తూ ముందుకు సాగాల్సిన ఈ గేమ్‌లో చివరికి ఎవరు గెలుస్తారన్నది కూడా ఊహించడం కష్టమే. అలాంటి ఉత్కంఠభరితమైన ప్రయాణానికి సెప్టెంబర్ 3న గ్రాండ్ ఫినాలేతో తెరపడింది. అయితే ఈసారి ఫలితం మాత్రం ఊహించని విధంగా వచ్చింది. ఇన్నోసెంట్స్‌ను బురిడీ కొట్టించిన ట్రేటర్లే విజేతలుగా నిలిచారు.

కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరించిన ‘ది ట్రేటర్స్ ఇండియా’ సీజన్ 2లో క్రిస్టల్ డిసౌజా, రిదా థరానా సంయుక్త విజేతలుగా నిలిచారు. ఇద్దరూ కలిసి రూ.66 లక్షల ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నారు. మొదటి నుంచి ట్రేటర్‌గా కొనసాగిన క్రిస్టల్ తన అసలు గుర్తింపును దాదాపు చివరి వరకు కొనసాగించడంతో ఆమె ఆట హైలెట్ గా నిలిచింది. తనపై అనుమానాలు వచ్చిన ప్రతిసారీ పరిస్థితిని చాకచక్యంగా మరో కంటెస్టెంట్ వైపు మళ్లిస్తూ ఆమె ముందుకు సాగింది. చివరకు అదే వ్యూహం ఆమెను ఫినాలే వరకు తీసుకెళ్లింది.

అయితే రిదా థరానా కథ మరింత ఇంట్రెస్టింగ్ గా సాగింది. గేమ్ ప్రారంభంలో ఆమె ఇన్నోసెంట్‌గా ఉండి, ట్రేటర్లను గుర్తించేందుకు చురుగ్గా ప్రయత్నించింది. ఆ తరువాత ట్రేటర్‌గా మారిన తర్వాత ఆమెకు కఠినమైన పరిస్థితులు ఎదురయ్యాయి. అయినప్పటికీ క్రిస్టల్‌తో కలిసి వ్యూహాలు రచిస్తూ ఆమె చివరి వరకు తన స్థానాన్ని కాపాడుకుంది. ఈ విజయంతో క్రిస్టల్ డిసౌజా, రిదా థరానా కలిసి రూ.66 లక్షల ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నారు. నివేదికల ప్రకారం, ప్రైజ్ పూల్‌లో ఉన్న రూ.48.40 లక్షలకు ఫైనల్ టాస్క్ ద్వారా మరో రూ.17.60 లక్షలు జత కావడంతో మొత్తం బహుమతి మొత్తం రూ.66 లక్షలకు చేరింది. ఈ మొత్తాన్ని ఇద్దరు విజేతలు పంచుకోనున్నారు.

క్రిస్టల్ ఆటతీరును షో హోస్ట్ కరణ్ జోహార్ కూడా ప్రశంసించారు. అనుమానాలు తనపైకి వచ్చినప్పటికీ వాటిని ఎలా డైవర్ట్ చేయాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎప్పుడు సరైన ఎత్తు వేయాలి అనే విషయంలో ఆమె చూపిన వ్యూహాత్మక తెలివి ఈ సీజన్‌లో ప్రత్యేకంగా నిలిచింది. మొత్తంగా  ‘ది ట్రేటర్స్ ఇండియా’ సీజన్ 2లో చివరి వరకు ట్రేటర్లను గుర్తించడమే ఇన్నోసెంట్స్‌కు అతిపెద్ద సవాల్‌గా మారింది. కానీ అనుమానాలు పెరిగిన ప్రతిసారీ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకున్న క్రిస్టల్, రిదా చివరికి అదే మైండ్ గేమ్‌ను విజయంగా మలిచారు. దీంతో ఈసారి కప్పు ఇన్నోసెంట్స్ చేతికి కాకుండా, అందరినీ మోసం చేస్తూ చివరి వరకు ఆడిన ట్రేటర్ల చేతికి వెళ్ళడం విశేషం.