NTV Telugu Site icon

Drama Juniors 7: సీతక్క ముఖ్య అతిథిగా డ్రామా జూనియర్స్ సీజన్ 7!

Drama Juniors

Drama Juniors

Drama Juniors 7 to Start from June 9th: జీ తెలుగు ఈ వారం రెండు సర్ప్రైజ్లను అందిచేందకు సిద్ధమైంది. జీ తెలుగు డ్రామా జూనియర్స్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ 7ను ఈ ఆదివారం గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ తో ప్రారంభించనుంది. పాపులర్ కిడ్స్ రియాలిటీ షో ఏడో సీజన్ కోసం తెలుగు బుల్లితెరపైకి రీఎంట్రీ ఇస్తోంది. డ్రామా జూనియర్స్ సీజన్ 7కు కూడా సీనియర్ నటి జయప్రద జడ్జిగా కొనసాగనున్నారు. టాలీవుడ్ కమెడియన్, దర్శకుడు బలగం వేణు, అందాల నటి పూర్ణ కూడా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి పిల్లల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించనున్నారు. ఈ సీజన్కి ప్రముఖ నటుడు, నిర్మాత శ్రీరామ్ వెంకట్ వ్యాఖ్యాతగా, పడమటి సంధ్యారాగం సీరియల్ ఆద్య, రామలక్ష్మి మెంటర్స్గా వ్యవహరిస్తున్నారు.

యాంకర్గా శ్రీరామ్ వెంకట్ హుషారు, మెంటర్స్ జోరు కలిసి ఈ సీజన్ ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచనుంది. మొదటి ఎపిసోడ్లో భాగంగా న్యాయనిర్ణేతలు కొన్ని నీతి కథలను చెప్పడం, కవిత్వం, ప్రాసలు పాడడం, వారి చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుని పిల్లల్లో ఉత్సాహం నింపనున్నారు. తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. ‘హ్యాపీ డేస్’ థీమ్తో వస్తున్న ఈ సీజన్లో పిల్లలు రెండు గ్రూపులుగా పోటీపడనున్నారు. కామెడీ, పురాణాలతో పాటు నటన పరంగా వివిధ జానర్లలో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. భారతీయ సినిమా సూపర్ స్టార్ల సలహాలు, సూచనలతో అద్భుతమైన టాలెంట్ తో ఈ సీజన్ ఆధ్యంతం రెట్టింపు వినోదాన్ని పంచేందుకు జీ తెలుగు సిద్ధంగా ఉంది. ఇక, మరింత ఆసక్తికరమైన కథాంశంతో జీ తెలుగు అందించనున్న సీరియల్ మేఘసందేశం.

ఈ సీరియల్ కథేంటంటే.. ప్రధాన పాత్రదారులైన భూమి (గౌరీ), గగన్ (అభినవ్) ఇద్దరి జీవితాలకు బాల్యంలోనే పరీక్ష పెడుతుంది విధి. అగ్నిప్రమాదంలో తల్లిని కోల్పోయిన భూమి చెత్తకుండిని చేరగా, తండ్రి చేసిన మోసంతో తండ్రిప్రేమకు దూరంగా పెరుగుతాడు గగన్. వైవిధ్యమైన నేపథ్యాల నడుమ భిన్న ధ్రువాలైన భూమి, గగన్ల జీవితాలు ఎలా ముడిపడ్డాయనేది తెలియాలంటే ఈ సోమవారం నుంచి జీ తెలుగులో ప్రసారం కానున్న మేఘసందేశం సీరియల్ తప్పక చూడాల్సిందే! గౌరీ, అభినవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా బుల్లితెర ప్రముఖ నటులు కౌశిక్, సుజిత కీలక పాత్రలు పోషించనున్నారు. సరికొత్త సీరియల్ మేఘసందేశం ప్రారంభంతో జీ తెలుగు ప్రముఖ సీరియల్స్ ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయి! సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు సూర్యకాంతం, రాత్రి 9 గంటలకు జగద్ధాత్రి, రాత్రి 10 గంటలకు ప్రేమ ఎంత మధురం ప్రసారం కానున్నాయి.