ఏపీ ఎస్డిసి నూతన ఛైర్మన్ గా పి. భరత్ భూషణ్, వైస్ చైర్మన్, డైరెక్టర్లకు పదవీ బాధ్యతలు స్వీకరించిన ఇతర సబ్యులకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ హృదయపూర్వక అభినందనలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి దిశగా తీసుకుంటున్న ఈ నిర్ణయం ఎంతో సానుకూలమైన అడుగని పేర్కొంది.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రత్యేకంగా అభినందించింది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల ప్రస్తుత సంక్షోభ పరిస్థితులపై బాలయ్య వ్యక్తం చేసిన ఆవేదన అలాగే సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న కష్టాలను బాలకృష్ణ చాలా స్పష్టంగా ప్రస్తావించారని అనేక థియేటర్లు మనుగడ కోసం పోరాడుతూ మూతపడే పరిస్థితికి చేరుకున్నాయని ఇండస్ట్రీ వాస్తవ పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయని తెలిపింది. “తెలంగాణ సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు ప్రత్యేక సౌకర్యాలు కోరడం లేదు. థియేటర్లను కాపాడేలా, తెలుగు సినీ పరిశ్రమను బలోపేతం చేసేలా న్యాయమైన, పారదర్శకమైన, స్థిరమైన వ్యవస్థ కావాలని మాత్రమే కోరుతున్నారు” అని ఫిల్మ్ చాంబర్ పేర్కొంది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలను బహిరంగంగా ప్రస్తావించి, ఎగ్జిబిటర్లకు మద్దతుగా నిలిచినందుకు నందమూరి బాలకృష్ణకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ ఎగ్జిబిటర్స్ కృతజ్ఞతలు తెలిపాయి.
