Suriya47: తమిళ స్టార్ హీరో సూర్యకు ఇప్పటికే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సూర్య47’ షూటింగ్ను పూర్తి చేశారు. చిత్రబృందం విడుదల చేసిన బీహైండ్ ది సీన్స్ వీడియోతో షూటింగ్ ముగిసిన విషయాన్ని అధికారికంగా వెల్లడించగా, ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీపై ఆసక్తికర చర్చ మొదలైంది. అందుతున్న సమాచారం ప్రకారం, ‘సూర్య47’ను 2026 దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఈ వార్త నిజమైతే సూర్యకు ఇది వరుసగా మూడో థియేట్రికల్ విడుదలగా నిలవనుంది. ఇప్పటికే ‘కరుప్పు’తో ప్రేక్షకులను పలకరించిన ఆయన, ఆగస్టు 14న వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ సినిమా విడుదలైన కొద్ది నెలలకే ‘సూర్య47’ కూడా థియేటర్లలోకి వస్తే, ఒకే ఏడాదిలో వరుసగా మూడు సినిమాలతో అభిమానులను అలరించిన హీరోగా సూర్య నిలుస్తారు. అయితే దీపావళి బరిలో వెట్రిమారన్ దర్శకత్వంలో సిలంబరసన్ టి.ఆర్ నటిస్తున్న ‘అరసన్’ కూడా విడుదలకు సిద్ధమవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది.
జితు మాధవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సూర్య47’ యాక్షన్ కామెడీ జానర్లో తెరకెక్కుతోంది. ఇందులో సూర్య ఒక విభిన్నమైన పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. తనలాగే విచిత్రమైన స్వభావం కలిగిన అధికారుల బృందానికి నాయకత్వం వహించే పాత్రలో ఆయన నటిస్తున్నట్లు సమాచారం. ఒక ప్రత్యేక మిషన్ కోసం బయలుదేరిన ఈ బృందం ఎదుర్కొనే సంఘటనలే కథకు హైలెట్ గా నిలవనున్నాయి. కామెడీ, యాక్షన్, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో దర్శకుడు దీనిని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో నటుడు నస్లెన్ కీలక పాత్ర పోషిస్తుండగా, నజ్రియా నజీమ్ ఫహద్ కథానాయికగా నటిస్తోంది. జితు మాధవన్ గత చిత్రాల శైలిని దృష్టిలో ఉంచుకుంటే, ఈ సినిమా కూడా వినోదంతో పాటు కొత్త తరహా కథనాన్ని అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక సూర్య ప్రస్తుతం కెరీర్ పరంగా కూడా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఆయన చివరిసారిగా ఆర్.జే. బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ డ్రామా ‘కరుప్పు’లో నటించారు. త్రిష కృష్ణన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఆర్.జే. బాలాజీ, ఇంద్రన్స్, అనఘ మాయ రవి, నటరాజన్ సుబ్రమణ్యం, స్వసిక, శివద తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మమితా బైజు కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన రెండో సింగిల్ ‘ది వెడ్డింగ్ సాంగ్’కు మంచి స్పందన లభించింది. ఈ పాటకు జి.వి. ప్రకాష్ సంగీతం అందించగా, సూర్య స్వయంగా ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఇంతటితో సూర్య ప్రాజెక్టులు ఆగిపోలేదు. ‘జై భీమ్’ తర్వాత దర్శకుడు టి.జె. జ్ఞానవేల్తో మరోసారి చేతులు కలిపి తన 48వ చిత్రాన్ని ప్రకటించారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. వరుసగా విభిన్నమైన కథలు, కొత్త దర్శకులతో ప్రయోగాలు, భారీ నిర్మాణ సంస్థలతో భాగస్వామ్యాలు చేస్తూ సూర్య తన కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు నిజంగానే ‘సూర్య47’ ఈ దీపావళికి థియేటర్లలోకి వస్తుందా? లేక రిలీజ్జ్ డేట్ లో మార్పులు చోటుచేసుకుంటుందా ? అనే విషయం తెలియాలంటే ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

