ప్రముఖ నట దంపతులు రాజశేఖర్, జీవిత కుమార్తె శివానీ రాజశేఖర్ నటించిన ‘అద్భుతం’ చిత్రం గత నెలలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది. ఇప్పుడు ఆమె మలి చిత్రం ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ’ సైతం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని సోనీ లివ్ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి దక్కించుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో డా. రవి ప్రసాద్ రాజు దాట్ల మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు)ను నిర్మించారు. ఫస్ట్ టైమ్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన దీనిలో అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన అన్ని పాటలు విశేష ఆదరణ దక్కించుకున్నాయి.
అతి త్వరలో ఈ చిత్రం సోనిలివ్లో ప్రసారం కానున్న సందర్భంగా నిర్మాత డా. రవి ప్రసాద్ మాట్లాడుతూ, ”మా ఫస్ట్ మూవీకి సురేష్ ప్రొడక్షన్స్ సమర్పకులుగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఓటీటీకి పర్ఫెక్ట్ ఛాయిస్. సోనివంటి ఇంటర్నేషనల్ సంస్థతో అసోసియేట్ అవడం చాలా హ్యాపీ. ఈ సినిమా సోని లివ్ ద్వారా మరింత ఎక్కువ మందికి చేరుతుందని ఆశిస్తున్నాం. గుహన్గారి మేకింగ్, అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ కెమిస్ట్రి అన్ని వర్గాలవారిని ఆకట్టుకుంటుంది” అని అన్నారు. ప్రియదర్శి, వైవా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు సైమన్ కె కింగ్ సంగీతం అందించారు.
