శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి నిర్మించిన సినిమా ‘విమానం’. ఇందులో వీరయ్య అనే తండ్రి పాత్రలో సముతిర కని , కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ నటిస్తుండగా సుమతి పాత్రలో అనసూయ భరద్వాజ్, రాజేంద్రన్ పాత్రలో రాజేంద్రన్, డేనియల్ పాత్రలో ధన్రాజ్, కోటి పాత్రలో రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో మెప్పించబోతున్నారు. ఈ సినిమా టీజర్ ను శనివారం వరుణ్ తేజ్ విడుదల చేశారు.
ఇందులో సినిమా థీమ్ ను దర్శకుడు తెలియచేశాడు. అంగ వైక్యలంతో ఇబ్బంది పడుతున్నా వీరయ్య తన కొడుకుని మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటుంటాడు. వీరయ్య కొడుక్కి మాత్రం ‘విమానం’ అంటే పిచ్చి. విమానం ఎక్కాలని ఆలోచనలతో ఎప్పుడూ తన చుట్టూ ఉన్నవారిని ప్రశ్నిస్తూనే ఉంటారు. తండ్రిని కూడా విమానం ఎక్కించమని బతిమాలాడుకుంటూ ఉంటాడు. బాగా చదువుకుంటే నువ్వే విమానం ఎక్కవచ్చునని కొడుకుతో అంటుంటాడు వీరయ్య. తండ్రీ కొడుకుల మధ్య అసలు ఈ విమానం గోల ఏంటనేది తెలుసుకోవాలంటే ‘విమానం’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. టీజర్వీ లో తండ్రి కొడుకుల మధ్య సాగే విమానం సంభాషణ ఆసక్తికరంగా, ఫన్నీగా ఉంది. అలాగే సినిమాలో బలమైన ఎమోషనల్ అంశాలు కూడా మిళితమై ఉన్నాయి. ‘నాన్నా ఎప్పుడు దేవుడు కనపడినా దండం పెట్టుకోమంటావు. ఎందుకు?’ అని అడిగిన కొడుకుతో ‘మనం అడిగినవన్నీ ఇస్తాడు కాబట్టి’ అని తండ్రి చెబుతాడు. దానికి ఆ పిల్లాడు ‘అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు.. నాన్నా అంటారు’ అనే డైలాగ్ తండ్రీ కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగ బంధాన్ని తెలిపేలా వుంది. ఈ ఎమోషనల్ జర్నీ జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
