Salman Khan: స్టార్ హీరోల జీవితాలు బయటకు కనిపించేంత విలాసవంతంగా మాత్రమే ఉండవు. కొన్నిసార్లు వారు ఎదుర్కొన్న చేదు అనుభవాలు కూడా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజాగా అలాంటి ఓ అనుభవాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. జైలులో గడిపిన రోజుల గురించి ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఒకే బాత్రూమ్ను 50 నుంచి 70 మంది ఖైదీలు ఉపయోగించాల్సి వచ్చేదని ఆయన వెల్లడించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
రితేష్ దేశ్ముఖ్, ఫరా ఖాన్ హోస్ట్లుగా హిందీ రియాలిటీ షో ‘లాక్ అప్’లో పాల్గొన్న సందర్భంగా సల్మాన్ ఖాన్ తన జైలు జీవితానికి సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. 1998లో కృష్ణజింకల వేట కేసు, 2002 లో హిట్ అండ్ రన్ కేసులో ఆయన కొద్ది రోజులు జైలులో గడపాల్సివచ్చింది. రియాలిటీ షోలో జైలులోని రోజులను గుర్తు చేసుకుంటూ తన మనసులోని మాటలను పంచుకున్నారు సల్మాన్ ఖాన్. అక్కడ మొదట కాస్త కఠినంగానే అనిపించినా, అక్కడి పరిస్థితులకు తాను త్వరగానే అలవాటు పడ్డానని చెప్పారు. జైలులో రోజువారీ జీవితం పూర్తిగా భిన్నంగా ఉండేదని, ప్రతి చిన్న విషయానికీ ఓపికగా ఉండాల్సివచ్చేదని ఆయన గుర్తు చేసుకున్నారు.
జైలులో దాదాపు 50 నుంచి 70 మంది ఖైదీలు ఒకే బాత్రూమ్ను ఉపయోగించాల్సి వచ్చేదని సల్మాన్ తెలిపారు. అంతేకాకుండా పప్పు, సాదాసీదా భోజనంతోనే రోజులు గడిపేవాడినని చెప్పారు. బయట ఉన్న సౌకర్యాలతో పోలిస్తే అక్కడి జీవితం పూర్తిగా భిన్నమైనదైనా, క్రమంగా అక్కడి వాతావరణానికి అలవాటు పడిపోయానని ఆయన వివరించారు. ఆ పరిస్థితులకు అలవాటు పడిన తర్వాత జైలు జీవితం అంత కష్టంగా అనిపించలేదని సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అక్కడ ఇంకొంత కాలం ఉండాల్సివచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండగలిగేవాడినని సరదాగా చెప్పారు. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను అంగీకరించి వాటికి తగ్గట్టుగా మారడం ఎంత ముఖ్యమో ఆ అనుభవం తనకు నేర్పిందని వెల్లడించారు.
ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా పలు సందర్భాల్లో సల్మాన్ ఖాన్ తన జైలు అనుభవాల గురించి మాట్లాడారు. ఆ రోజులు తనలో సహనం పెంచాయని, మన నియంత్రణలో లేని పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో అర్థమయ్యేలా చేశాయని ఆయన చెప్పేవారు. అందుకే ఇప్పుడు కూడా ఆ జ్ఞాపకాలను ఎలాంటి సంకోచం లేకుండా అభిమానులతో పంచుకుంటున్నారు. మరోవైపు ఆయన ప్రస్తుతం దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న సినిమాలో బిజీగా ఉన్నారు.

