Ramayana: ‘రామాయణం’ ట్రైలర్‌లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!

Ramayana2

Ramayana2

Ramayana: దర్శకుడు నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ ‘రామాయణం’ ట్రైలర్ ను జూలై 30న ఉదయం 4:15 గంటలకు పవిత్రమైన బ్రాహ్మ ముహూర్తంలో మేకర్స్ డిజిటల్‌గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ‘రామాయణం’ ట్రైలర్ విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా భారీ చర్చ మొదలైంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యష్ రావణాసురుడిగా కనిపించిన విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ కొన్ని పాత్రల విషయంలో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ మహాకావ్యంలో అత్యంత కీలకమైన పాత్ర అయిన హనుమంతుడు ట్రైలర్‌లో ఎందుకు కనిపించలేదు? సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో నటిస్తున్న విషయం ముందే తెలిసినా, ట్రైలర్‌లో ఆయనను ఒక్క ఫ్రేమ్‌లో కూడా చూపించకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. సన్నీ డియోల్ కూడా ఈ విషయంలో చిన్నబుచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ సందేహాలకు స్వయంగా రణబీర్ కపూర్ సమాధానం చెప్పడంతో ఈ చర్చకు మరింత ఊపొచ్చింది.

దర్శకుడు నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం మొదటి భాగం కథ సీతాపహరణం వరకు మాత్రమే సాగుతుంది. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడికి హనుమంతుడితో పరిచయం సీతాపహరణం తర్వాతే జరుగుతుంది. అందుకే తొలి భాగం ట్రైలర్‌లో హనుమంతుడిని, వానర సేనను చూపించలేదని తెలుస్తోంది. ఈ నిర్ణయం కథను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నదేనని చిత్రబృందం భావిస్తోంది. సన్నీ డియోల్ పాత్రకు సంబంధించిన గ్రాండ్ ఎంట్రీని నేరుగా సినిమాలోనే ప్రేక్షకులు చూసేలా ప్లాన్ చేసినట్లు సమాచారం.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ ఈ విషయాన్ని మరింత స్పష్టంగా వివరించారు. రెండో భాగంలో హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపించనున్నారని అధికారికంగా ధృవీకరించిన ఆయన, ఆ పాత్రకు సినిమాలో అత్యంత కీలకమైన ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా రెండో భాగంలో హనుమంతుడి చుట్టూ సాగే ఘట్టాలు ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రెండో భాగం షూటింగ్ దాదాపు 50 శాతం పూర్తైందని, తొలి భాగంతో పోలిస్తే అది మరింత భారీ స్థాయిలో తెరకెక్కుతోందని కూడా తెలిపారు.

అంతేకాదు రామాయణం వంటి మహాకావ్యాన్ని కేవలం రెండు భాగాల్లో చెప్పడం చాలా క్లిష్టమైన పని అని రణబీర్ అభిప్రాయపడ్డారు. తన దృష్టిలో ఈ కథను పూర్తిగా తెరపై ఆవిష్కరించాలంటే పది సినిమాలు తీసినా సరిపోవని అన్నారు. అయినప్పటికీ కథ సారాన్ని కోల్పోకుండా రెండు భాగాల్లో చెప్పేలా దర్శకుడు నితేష్ తివారీ, రచయితల బృందం అద్భుతమైన స్క్రీన్‌ప్లే రూపొందించారని ప్రశంసించారు. అంత పెద్ద కథను సంక్షిప్తంగా చెప్పడం వెనుక ఎంతో కృషి ఉందని ఆయన వెల్లడించారు. ఇంకా ఒక ముఖ్యమైన అంశంపై కూడా రణబీర్ స్పందించారు. రామాయణాన్ని ఇప్పటి ప్రేక్షకుల కోసం పూర్తిగా మార్చే ప్రయత్నం కూడా చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అత్యాధునిక విజువల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నప్పటికీ, కథను ఏమాత్రం మార్చలేదన్నారు.

ట్రైలర్‌లో హనుమంతుడు కనిపించకపోవడంతో మొదలైన సందేహాలకు ఇప్పుడు స్పష్టత రావడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ముఖ్యంగా సన్నీ డియోల్ హనుమంతుడిగా ఎలా కనిపిస్తారు, ఆయన గ్రాండ్ ఎంట్రీ ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తొలి భాగం విడుదలకు ముందే రెండో భాగంపై ఇంతటి ఆసక్తి నెలకొనడం, ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల అంచనాలు ఎంత స్థాయిలో ఉన్నాయో మరోసారి నిరూపిస్తోంది.