Malayalam movie updates: మలయాళం సినీ పరిశ్రమలో దర్శకుడు ప్రియదర్శన్, నటుడు మోహన్లాల్ కాంబినేషన్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈ జోడీ మరోసారి కలిసి పని చేయనున్నట్లు ప్రకటించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇది ప్రియదర్శన్ కెరీర్లో 100వ చిత్రంగా రూపొందనున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్పై ఆసక్తి మరింత పెరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ కలిగించే వార్త వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక చిత్రం అనుకున్న సమయానికి ప్రారంభం కాకుండా 2027కు వాయిదా పడినట్లు తెలుస్తోంది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ సినిమా షూటింగ్ను మొదట 2026 అక్టోబర్లో ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించారు. అయితే ప్రస్తుతం కథ, స్క్రీన్ప్లేలో కీలక మార్పులు జరుగుతుండటంతో ప్రీ ప్రొడక్షన్ పనులు మరింత సమయం తీసుకుంటున్నాయని సమాచారం. అందుకే ఈ మూవీ షూటింగ్ 2027కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రియదర్శన్ మరోవైపు నటుడు పంకజ్ త్రిపాఠితో రూపొందిస్తున్న డ్రామెడీ మూవీ స్క్రిప్ట్పై కూడా పని చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, దర్శకుడు ప్రియదర్శన్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్తో వరుస చిత్రాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘భూత్ బంగ్లా’, ‘హైవాన్’ చిత్రాల తర్వాత కూడా అక్షయ్తో మరో కొత్త ప్రాజెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ బిజీ షెడ్యూల్ కూడా మోహన్లాల్ ప్రాజెక్ట్ ఆలస్యానికి ఒక కారణంగా భావిస్తున్నారు.
ఇక ఈ ప్రాజెక్ట్ను ప్రకటించిన సమయంలో మోహన్లాల్ ఎమోషనల్ గా స్పందించారు. ప్రియదర్శన్ 100వ చిత్రం తనతో చేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. వంద సినిమాలు పూర్తి చేయడం ఒక సంఖ్య కాదని, అది దశాబ్దాలపాటు సినిమా పట్ల ఉన్న అంకితభావానికి ఆయన పేర్కొన్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగం కావడం తన అదృష్టమని కూడా చెప్పారు. ప్రియదర్శన్, మోహన్లాల్ గతంలో ‘మరక్కర్: అరబికడలింటే సింహం’ వంటి భారీ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. మరోవైపు మోహన్లాల్ ఇటీవల ‘దృశ్యం 3’తో ప్రేక్షకుల ముందుకు రాగా, ప్రస్తుతం తరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అతిమనోహరం’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా 2026 డిసెంబర్ 24న విడుదల కానుంది. ఇక ప్రియదర్శన్ 100వ చిత్రం ఎప్పుడు సెట్స్పైకి వెళ్తుందనే దానిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

