Prithviraj Sukumaran: ఇతర భాషల్లో క్రేజ్… మాలీవుడ్‌లో తగ్గుతున్న పృథ్వీరాజ్ జోరు?

Prithviraj Sukumaran (2)

Prithviraj Sukumaran (2)

Prithviraj Sukumaran: ఒకప్పుడు మలయాళ చిత్రసీమకే పరిమితమైన పృథ్వీరాజ్ సుకుమారన్, పాన్ ఇండియా నటుడిగా  గుర్తింపు పొందారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ ఆయన తనదైన నటనతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. విభిన్న పాత్రలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుండే ఆయన, దర్శకుడిగానూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. అయితే ఇలాంటి బలమైన కెరీర్ మధ్యలో ఆయన తాజా చిత్రం ‘ఐ నోబడీ’ మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘ఐ నోబడీ’ విడుదలకు ముందే పెద్దగా హడావిడి కనిపించలేదు. విడుదల తర్వాత కూడా ఈ చిత్రానికి ఆశించిన స్పందన రాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద నిరాశే ఎదురైంది. ముఖ్యంగా పృథ్వీరాజ్‌కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పెరుగుతున్న సమయంలో ఇలాంటి పరిస్థితి రావడం ఆశ్చర్యంగా మారింది. కేరళ వెలుపల సినిమాను బలంగా ప్రమోట్ చేయడంలో నిర్మాతలు విఫలమయ్యారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమాలు దాదాపు కనిపించకపోవడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అవగాహన కూడా పెద్దగా ఏర్పడలేదు. తమిళనాడు, హిందీ మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఫలితంగా విడుదలైన విషయం కూడా చాలామందికి తెలియకుండా సినిమా థియేటర్లలోకి వచ్చి వెళ్లిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పృథ్వీరాజ్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కేరళలో కూడా ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మౌత్ టాక్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకుల ఆదరణ దక్కలేదు. సమస్య ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు, ఇటీవల వచ్చిన ‘పల్లిచట్టంబి’, ‘సర్జమీన్’ వంటి పృథ్వీరాజ్ సోలో చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ విజయాన్ని నమోదు చేయలేకపోయాయి. నటుడిగా ఆయనపై ప్రశంసలు కొనసాగుతున్నప్పటికీ, సినిమాల ఎంపిక మాత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనే చర్చ మొదలైంది. ప్రస్తుతం పృథ్వీరాజ్ కెరీర్‌లో మరో కీలక ఘట్టం ఎదురుచూస్తోంది. ఆయన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న ఈ ప్రాజెక్ట్ ఆయనకు మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకురావొచ్చనే ఆశాభావం ఉంది. అయితే ‘ఐ నోబడీ’ ఫలితం మాత్రం ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. నేటి పరిస్థితుల్లో సినిమా విజయానికి స్టార్ ఇమేజ్ మాత్రమే సరిపోదు. బలమైన కథతో పాటు సమర్థవంతమైన ప్రచారం కూడా విజయానికి అంతే కీలకమనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించింది. పృథ్వీరాజ్ కూడా ఇప్పుడు ‘వారణాసి’ మీదనే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక రాజమౌళి ఈ పాన్ ఇండియా నటుడుకి కొత్త లైఫ్ ఇస్తాడేమో చూడాలి మరి.