Mr Perfect Copyright Case: దిల్‌రాజుకు సుప్రీంకోర్టులో ఊరట.. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కాపీరైట్ కేసులో కీలక పరిణామం!

Dil Raju

Dil Raju

Mr Perfect Copyright Case: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజును కొన్నేళ్లుగా వెంటాడుతున్న కాపీరైట్ వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 2011 నాటి ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా కథను ఓ రచయిత్రి నవల నుంచి కాపీ చేశారనే ఆరోపణలతో మొదలైన ఈ కేసులో ప్రస్తుతం విచారణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీంతో సీనియర్ నిర్మాతకు కొంత ఊరట లభించినట్లైంది. అయితే అసలు వివాదం ఏంటి? ఈ కేసు ఇంతకాలం ఎందుకు కొనసాగుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే..

2011లో వచ్చిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ (Mr Perfect) సినిమాలో ప్రభాస్, కాజల్, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించగా, నిర్మాత దిల్ రాజు దీనిని నిర్మించారు. అయితే రచయిత్రి శ్యామలా రాణి తాను 2010లో రాసిన ‘నా మనసు కోరింది నిన్నే’ అనే నవలలోని కథ, సన్నివేశాలు, డైలాగులను కాపీ కొట్టి ఈ సినిమాను తీశారంటూ 2017లో మియాపూర్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు దశరథ్, డైలాగ్ రైటర్ అబ్బూరి రవిలపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్, కాపీరైట్ సెక్షన్ల కింద అప్పట్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.

ఈ ఫిర్యాదు ఆధారంగా ట్రయల్ కోర్టు దిల్‌రాజుపై మోసం, కాపీరైట్ చట్టాలకు సంబంధించిన చర్యలు ప్రారంభిస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామంతో దిల్‌రాజు తనపై వచ్చిన ఆరోపణలను సవాలు చేస్తూ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించారు. కేసు కారణంగా తన ప్రతిష్టకు నష్టం కలిగే అవకాశం ఉందని భావించిన ఆయన, ట్రయల్ కోర్టు చర్యలను నిలిపివేయాలని కోరారు. ఈ క్రమంలో కేసు హైకోర్టుకు చేరింది. అక్కడ దిల్‌రాజుపై ఉన్న చీటింగ్ ఆరోపణలకు సంబంధించి ఆయనకు అనుకూలమైన నిర్ణయం వచ్చింది.

అయితే హైకోర్టు కాపీరైట్ అంశాన్ని మాత్రం పూర్తిగా కొట్టివేయలేదు. చీటింగ్ ఆరోపణలను తొలగించినప్పటికీ, కాపీరైట్ కోణంలో కేసును ట్రయల్ కోర్టు కొనసాగించేందుకు అనుమతించింది. దీంతో దిల్‌రాజు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2025 ప్రారంభంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌లో కేసు కొనసాగింపుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా అసలు ఫిర్యాదు నిర్ణీత కాలపరిమితిలో దాఖలైందా లేదా అనే అంశం కూడా న్యాయపరంగా పరిశీలనకు వచ్చింది. ఈ అంశాన్ని పరిశీలించే సమయంలో సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు తదుపరి చర్యలను నిలిపివేసింది. అంటే కేసులో దిగువ కోర్టు విచారణ ముందుకు సాగకుండా స్టే విధించింది. ఫిర్యాదు దాఖలు చేసిన సమయం, కేసు కొనసాగింపుకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు భావించింది.

తాజాగా ఈ స్టేను ఎత్తివేయాలని ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. రచయిత్రి వయస్సును కూడా ప్రస్తావిస్తూ కేసు త్వరగా ముందుకు సాగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆ అభ్యర్థనను అంగీకరించలేదు. స్టే విధించే ముందు కేసుకు సంబంధించిన వివరాలు, ఇరుపక్షాల వాదనలు ఇప్పటికే పరిశీలించినట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కాపీరైట్ వివాదంలో ట్రయల్ కోర్టు చర్యలపై విధించిన స్టే కొనసాగనుంది. ఈ నిర్ణయం దిల్‌రాజుకు తాత్కాలికంగా ఊరటనిచ్చినప్పటికీ, కేసు పూర్తిగా ముగిసిపోయినట్లు మాత్రం కాదు. కాపీరైట్ ఆరోపణలపై ఫైనల్ జడ్జిమెంట్ ఇంకా రావాల్సి ఉంది.

ప్రభాస్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ 2011లో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందిన విషయం తెలిసిందే. దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత అదే సినిమాకు సంబంధించిన కాపీరైట్ వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతానికి సుప్రీంకోర్టు స్టే కొనసాగించడంతో దిల్‌రాజుకు కొంత రిలీఫ్ లభించినప్పటికీ, ఈ వివాదానికి తుది పరిష్కారం ఎప్పుడు లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.