తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా… తొలిసారి చిన్నారుల కోసం ‘మహా గణేశ’ అనే యానిమేటెడ్ ఒరిజినల్ను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ప్రసారం చేయనుంది. ఆహా కిడ్స్ ద్వారా మన పురాణ కథలు, విలువలును తెలియజేసేలా పలు ఒరిజినల్స్ను ఈతరం చిన్నారులకు అందిస్తోంది. ‘మహా గణేశ’ వెబ్ యానిమేటెడ్ ఒరిజినల్ను ఆహా, గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ప్రై. లి. కలయికలో రాజీవ్ చిలక తెరకెక్కించారు. ఇందులో ఎనిమిది ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ వ్యవధి 15 నిమిషాలుంటాయి. ఇది మన దేవతల్లో ప్రథమ పూజలు అందుకునే విఘ్నేశ్వరుడికి సంబంధించిన పండుగ వినాయక చవితి పురాణాన్ని తెలియజేస్తుంది. వినాయకునికి ఏనుగు తలను ఎందుకు పెట్టారు, అలాగే తన తమ్ముడు కార్తికేయతో గణేశుడు ఎందుకు పోటీ పడి మూడుసార్లు మూల్లోకాలను ప్రదక్షిణాలు చేశారు. చంద్రుడికి, వినాయక చవితినాడు ఎందుకు శాపం పెట్టారు, రాక్షసరాజు గజాసురుడిని వినాయకుడు మధ్య యుద్ధం తదితర విషయాలన్నీ ఈ వెబ్ సిరీస్లో కథలాగా పొందుపరిచారు.
‘మహా గణేశ’ను కౌశిక్ కర్ర రచించగా, శ్రీనివాస శర్మా రాణి సంగీతాన్ని అందించారు. జి. డి. ఆర్. మోహన్, ఎ. గంగరాజ్ చరణ్ యానిమేషన్ డైరెక్టర్స్ వర్క్ చేశారు. టి.ఎ.కె. కుమార్ ఈ షోకు వాయిస్ డైరెక్టర్గా పనిచేశారు. ‘మహా గణేశ’ తొలి పోస్టర్, సాంగ్ను మంగళవారం రాజీవ్ చిలక(గ్రీన్ గోల్డ్ యానిమేషన్, సి.ఇ.ఓ), అజిత్ ఠాకూర్ (ఆహా, సి.ఇ.ఓ) విడుదల చేశారు.
