Janhvi Kapoor: టాలీవుడ్ తర్వాత కోలీవుడ్‌పై ఫోకస్.. భారీ వెబ్ సిరీస్‌తో జాన్వీ కపూర్ డిజిటల్ ఎంట్రీ!

Janhvi Kapoor (2)

Janhvi Kapoor (2)

Janhvi Kapoor: బాలీవుడ్‌లో స్టార్ కిడ్‌గా ప్రయాణం ప్రారంభించిన జాన్వీ కపూర్, ఇప్పుడు దక్షిణాది సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు హిందీ చిత్రాలకే పరిమితమైన ఆమె, ఇప్పుడు వరుసగా తెలుగు, తమిళ ప్రాజెక్ట్‌లను ఎంపిక చేసుకుంటూ తన కెరీర్‌ను కొత్త దిశగా తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా పెద్ద బ్యానర్లు, భారీ స్థాయి ప్రాజెక్ట్‌లను ఎంచుకోవడంలో జాన్వీ అనుసరిస్తున్న వ్యూహం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ తర్వాత కోలీవుడ్‌లో కూడా ఆమె అరంగేట్రం ఖరారైనట్లు వార్తలు రావడంతో సినీ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

తెలుగులో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సరసన నటించిన ‘దేవర’ సినిమాతో జాన్వీ కపూర్ దక్షిణాదిలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం ‘పెద్ది’లో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకోవడం ద్వారా మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ రెండు చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన జాన్వీ, ఇప్పుడు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే ఈసారి ఆమె ఎంట్రీ సినిమా ద్వారా కాదు. ఒక భారీ వెబ్ సిరీస్‌తో కోలీవుడ్ డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘కురత్తి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ దర్శకుడు పా.రంజిత్‌కు చెందిన ‘నీలం ప్రొడక్షన్స్’ నిర్మించనుంది. ఈ వెబ్ సిరీస్‌కు తమిళ దర్శకుడు సర్గణమ్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ‘కలవాణి’, ‘నైయాండి’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన ఆయన, ఈ ప్రాజెక్ట్‌ను కూడా వాస్తవికతకు దగ్గరగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, కథ జాన్వీ కపూర్‌కు నచ్చడంతో ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశముంది.

ఇక జాన్వీ కపూర్ కెరీర్ పరంగా చూస్తే, ఈ వెబ్ సిరీస్ కీలక మలుపుగా మారే అవకాశం కనిపిస్తోంది. ‘దేవర’ కమర్షియల్‌గా విజయాన్ని అందుకున్నప్పటికీ, ఆమె పాత్ర నిడివి, నటనపై సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు వ్యక్తమయ్యాయి. అలాంటి సమయంలో పా.రంజిత్ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న కంటెంట్ ఆధారిత వెబ్ సిరీస్‌ను ఎంపిక చేసుకోవడం ద్వారా నటిగా తన ప్రతిభను నిరూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఓటీటీలో కంటెంట్ కు ప్రాధాన్యం ఉన్న వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘కురత్తి’ కూడా అలాంటి కంటెంట్‌తో వస్తే జాన్వీ కపూర్‌కు తమిళంలోనే కాకుండా దక్షిణాది మొత్తం మార్కెట్‌లో మరింత బలమైన గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఈ ప్రాజెక్ట్ జాన్వీ కెరీర్‌లో మరో కీలక అధ్యాయంగా నిలుస్తుందా అనే చర్చ ఇప్పటికే సినీ వర్గాల్లో మొదలైంది.