Ajith Kumar: షూటింగ్ ఛాంపియన్‌గా నిలిచిన హీరో అజిత్ కుమార్.. నాలుగు బంగారు పతకాలు కైవసం

Ajith Kumar

Ajith Kumar

Ajith Kumar: కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అజిత్ కుమార్ రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ తనలోని పవర్‌ను అభిమానులకు చాటి చెప్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో షూట్ చేసే వ్యక్తిగా అభిమానులు అజిత్‌ను చూసి ఉంటారు. అయితే ఇప్పుడు రియల్ లైఫ్‌లో షూటింగ్‌లో అజిత్ ఇరగదీస్తున్నాడు. ప్రస్తుతం 47వ తమిళనాడు రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో అజిత్‌తో పాటు అతడి టీమ్ కూడా పాల్గొంది. ఈ మేరకు నాలుగు బంగారు పతకాలు, రెండు కాంస్య పతకాలను అజిత్ అండ్ టీమ్ సొంతం చేసుకుంది. దీంతో అజిత్ అభిమానులు సోషల్ మీడియాలో తమ హీరోను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. తిరుచ్చిలో జరుగుతున్న 47వ తమిళనాడు రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఈనెల 24 నుంచి ఈనెల 31 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అజిత్ టీమ్ CFP మాస్టర్ పురుషుల జట్టు, స్టాండర్డ్ పిస్టల్ మాస్టర్ పురుషుల జట్టు (NR), స్టాండర్డ్ పిస్టల్ మాస్టర్ పురుషుల జట్టు (ISSF), 50m FP మాస్టర్ పురుషుల టీమ్ ఈవెంట్‌లోనాలుగు బంగారు పతకాలను గెలుచుకుంది. అలాగే 50m FP పురుషుల జట్టు, స్టాండర్డ్ పిస్టల్ పురుషుల టీమ్ ఈవెంట్‌లలో రెండు కాంస్య పతకాలను సైతం సొంతం చేసుకుంది. దీంతో అజిత్ గెలుచుకున్న బంగారు పతకాలు, సిల్వర్ పతకాల గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. 50 ఏళ్ల వయసులోనూ అజిత్ క్రీడలలో పతకాలు గెలుచుకోవడం అభినందనీయమని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read Also: Rare Love Marriage: అరుదైన ప్రేమ పెళ్లి. ఆన్ లైన్ వివాహానికి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

కాగా గత ఏడాది చెన్నైలో జరిగిన షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో హీరో అజిత్ ఆరు బంగారు పతకాలను గెలుచుకున్నాడు. సినిమాల విషయానికి వస్తే అజిత్ ప్రస్తుతం హెచ్.వినోద్‌తో కలిసి ఓ మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి #AK61 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. సినిమా కథనం బ్యాంకు దోపిడీ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీకి సంబంధించి హైదరాబాద్‌లోని చెన్నైలోని ప్రముఖ ల్యాండ్‌మార్క్ మౌంట్ రోడ్‌ను పోలిన భారీ సెట్‌ను యూనిట్ నిర్మించి సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ మూవీ చివరి షెడ్యూల్ ఇంకా పూర్తి కాలేదు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే అజిత్ తన తదుపరి ప్రాజెక్ట్‌కి వెళ్లాలని భావిస్తున్నారు. అజిత్ తదుపరి మూవీకి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించనున్నాడు.