పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. ఇప్పటికే యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఎ.ఎం. రత్నం సమర్పణలో ఆయన సోదరుడు దయాకర్ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ నాయికగా నటిస్తున్న పిరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు’ తాజా షెడ్యూల్ కొత్త సంవత్సరంలో మొదలు కానుంది. దీనికి సంబంధించిన పనులను దర్శకుడు క్రిష్ చకచకా చేస్తున్నారు.
తాజాగా స్క్రిప్ట్ రీడింగ్ సెషన్ ను పవన్ కళ్యాణ్ తో చేయించారు క్రిష్. తామిద్దరూ అదే పనిలో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన క్రిష్… షూటింగ్ వచ్చే నెలలో మొదలవుతున్నట్టు తెలిపారు. సంక్రాంతి కానుకగా రాబోతున్న ‘భీమ్లా నాయక్’ షూటింగ్ ముగింపుదశలో ఉండటంతో దానిని పూర్తి చేసి, పవన్ ‘హరిహర వీరమల్లు’ బాలెన్స్ షూటింగ్ లో పాల్గొంటారు. ఏప్రిల్ 29న విడుదల కావాల్సి ఉన్న ఈ ఎపిక్ మూవీకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
