Romantic Movie OTT: గ్రామీణ జీవితంలోని మట్టివాసన, అమాయక ప్రేమ, సరదా సంఘటనలు తెరపై కనిపించినప్పుడు ప్రేక్షకులు ఎప్పుడూ ప్రత్యేకంగా కనెక్ట్ అవుతారు. అయితే ప్రతి మంచి కథ థియేటర్లలో విజయం సాధించాల్సిన అవసరం లేదు. కొన్ని సినిమాలు వెండితెరపై ఆశించిన స్థాయిలో మెప్పించకపోయినా, డిజిటల్ వేదికలపై మాత్రం దూసుకెళ్తుంటాయి. ఇప్పుడు అలాంటి అరుదైన మలుపునే చూసింది తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ‘గోదారి గట్టుపైనా’ (Godari Gattupaina). థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఈ సినిమా, ఓటీటీలో మాత్రం ప్రేక్షకుల ఆకట్టుకుంటూ ట్రెండింగ్ జాబితాలో చోటు సంపాదించడం విశేషం.
సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో రూపొందింది. ప్రముఖ నటుడు జగపతి బాబు కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడం మరో ప్రత్యేకత. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు నిర్మాతగా వ్యవహరించారు. గ్రామీణ మనుషుల మధ్య ఉండే అనుబంధాలు, ప్రేమలో ఎదురయ్యే చిన్న చిన్న సంఘటనలను దర్శకుడు తెరపై చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. 2026 మే 8 న థియేటర్లలో విడుదల అయిన ఈ మూవీకి ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కలేదు. పలు కారణాల వల్ల బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం వెనుకబడింది. కథనం నెమ్మదిగా సాగడం, విడుదల సమయంలో ఎదురైన పోటీ, ప్రమోషన్ల ప్రభావం వంటి అంశాలు కూడా సినిమాపై ప్రభావం చూపినట్లు సినీ విశ్లేషకులు భావించారు.
అయితే ఓటీటీ ప్రపంచం మరోసారి ఒక విషయాన్ని నిరూపించింది. మంచి కంటెంట్ ను ప్రేక్షకులు ఎప్పటికైనా ఆదరిస్తారనే విషయాన్ని ‘గోదారి గట్టుపైనా’ మరోసారి గుర్తు చేసింది. మే 29 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు రావడంతో అనూహ్యంగా ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. థియేటర్లలో పెద్దగా గుర్తింపు పొందని సినిమా, డిజిటల్ వేదికపై ఇంతటి స్పందన పొందడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా వేదికలో కూడా ఈ సినిమా అందుబాటులో ఉండటం మరింత మంది ప్రేక్షకులకు దగ్గరవుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, గ్రామీణ ప్రేమకథలను ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను ఆసక్తిగా వీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో మిస్సైన అవకాశాన్ని ఓటీటీ ద్వారా సద్వినియోగం చేసుకుంటున్న ‘గోదారి గట్టుపైనా’ ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో తన విజయగాథను కొత్తగా రాస్తుండటం విశేషం.
