Egg Prices Drops After Iran War: ఇరాన్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ఇప్పుడు గుడ్ల మార్కెట్ పైనా కనిపిస్తోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో దేశీయ మార్కెట్లో ధరలు భారీగా పడిపోయాయి. విజయవాడ హోల్సేల్ మార్కెట్లో గుడ్డు ధరలు ఒక్కసారిగా క్షీణించడంతో వ్యాపారులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారం వరకు హోల్సేల్ మార్కెట్లో ఒక్క గుడ్డు ధర సుమారు రూ.5 వరకు ఉండేది. అయితే ప్రస్తుతం ఆ ధర రూ.4.30 వరకు పడిపోయింది. కేవలం కొన్ని రోజుల్లోనే ఈ స్థాయిలో ధరలు పడిపోవడం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.
ఫిబ్రవరి 15న విజయవాడ హోల్సేల్ మార్కెట్లో ఒక్క గుడ్డు ధర రూ.5.45 వరకు నమోదైంది. ఆ తర్వాత కొద్దిరోజులు రూ.5.35 వరకు కొనసాగిన ధరలు.. ఇప్పుడు ఒక్కసారిగా క్షీణించాయి. దీంతో మార్కెట్లో గుడ్ల సరఫరా అధికమవడం కూడా ధరల పతనానికి కారణమైంది. ఇరాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా గల్ఫ్ దేశాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. దీనివల్ల దేశీయ మార్కెట్లో సరఫరా పెరిగి ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఎగుమతులు మళ్లీ సాధారణ స్థితికి రాకపోతే ధరలు మరింత తగ్గే అవకాశం కూడా ఉంది. యుద్ధ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు స్థానిక వ్యవసాయ ఉత్పత్తులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
