Crime Thriller OTT : మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే క్రైమ్ థ్రిల్లర్లు ప్రేక్షకులను చివరి నిమిషం వరకు సస్పెన్స్లో ఉంచడంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాయి. వీటిలో ఇన్వెస్టిగేటివ్ స్టోరీలకు ఉండే క్రేజే వేరు. సస్పెన్స్, ఊహించని ట్విస్టులతో పిచ్చెక్కిస్తుంటాయి. ఇప్పుడు అలాంటి మరో ఇంటెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. యువ నటుడు షేన్ నిగమ్ ప్రధాన పాత్రలో నటించిన ‘దృఢం’ త్వరలో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్కు రానుండటం థ్రిల్లర్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. చివరి వరకు ఉత్కంఠతో నిలబెట్టే క్రైమ్ థ్రిల్లర్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ సినిమా కావాల్సినంత థ్రిల్ ఇవ్వబోతోంది.
జియోహాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్
మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ‘దృఢం’ (Dridam) మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు జూన్ 12 నుంచి జియోహాట్స్టార్ (JioHotstar) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మలయాళ భాషతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుండటంతో దేశవ్యాప్తంగా మరింత మంది ప్రేక్షకులకు చేరువ కానుంది. షేన్ నిగమ్తో పాటు సాన్య, శోభి తిలకన్, కృష్ణ ప్రభ, నందన్ ఉన్ని, దినేష్ ప్రభాకర్, కొట్టాయం రమేష్, బిట్టో డేవిస్ వంటి నటీనటులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు. మలయాళ క్రైమ్ థ్రిల్లర్లకు ఓటీటీ ప్రేక్షకుల్లో ఇప్పటికే ప్రత్యేకమైన ఆదరణ ఉంది. ఆ జాబితాలో ‘దృఢం’ కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దర్శకుడిగా జీతూ జోసెఫ్ శిష్యుడు
ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన మార్టిన్ జోసెఫ్ పేరు కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మలయాళ సినీ ప్రపంచానికి ఎన్నో అద్భుతమైన థ్రిల్లర్లను అందించిన దర్శకుడు జీతూ జోసెఫ్ శిష్యుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ‘దృశ్యం’ వంటి ఇండస్ట్రీ హిట్ ఫ్రాంచైజీ వెనుక ఉన్న జీతూ జోసెఫ్ ప్రభావం ఈ చిత్రంపై కూడా కనిపిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జోమోన్ జాన్, లింటో దేవసియా అందించిన స్క్రీన్ప్లే కథను బలంగా నిలబెట్టగా, ఈ4 ఎక్స్పెరిమెంట్స్ బ్యానర్పై ముకేష్ ఆర్ మెహతా, సి.వి. సారథి ఈ చిత్రాన్ని నిర్మించారు. జీతూ జోసెఫ్ తన ‘బెడ్టైమ్ స్టోరీస్’ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని సమర్పించడం కూడా సినిమాపై అంచనాలను పెంచింది.
‘దృఢం’ కథ
ఈ కథ ఒక ప్రశాంతమైన గ్రామీణ ప్రాంత పోలీస్ స్టేషన్లో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ రాధాకృష్ణన్ చుట్టూ తిరుగుతుంది. బదిలీ మీద కొత్త స్టేషన్ లో అడుగు పెట్టిన విజయ్ కి మొదట్లోనే ఆ ప్రాంతాన్ని కుదిపేసే వరుస హత్యలు వెల్కమ్ చెబుతాయి. అంతేకాకుండా భారీ బ్యాంకు దోపిడీ వంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఇక వీటి వెనుక ఉన్నది ఎవరో కనిపెట్టే ప్రయత్నంలో కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఒక్కో క్లూ తో స్టోరీ చాలా క్రేజీగా సాగుతుంది. అసలు హత్యలు ఎవరు చేశారు ? ఎందుకు చేశారు ? బ్యాంకు దోపిడీకి దీనకి సంబంధం ఉందా ? ఈ కేసును ఛేదించేందుకు సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ చేసే ప్రయత్నాలు కథను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తాయి.
