Disha Patani : ప్రాణ స్నేహితులకు కన్నీటి వీడ్కోలు.. ఇన్‌స్టాలో దిశా ఎమోషనల్ పోస్ట్ వైరల్

Disha Patani (2)

Disha Patani (2)

Disha Patani : సెలబ్రిటీల జీవితాల్లో గ్లామర్ సందడి మాత్రమే కాదు, కెమెరాల వెలుగులకు దూరంగా వారికి కూడా మిగతా వారిలాగే కొన్ని అనుబంధాలు ఉంటాయి. ముఖ్యంగా పెంపుడు జంతువులతో ఏర్పడే బంధం మాటల్లో చెప్పలేనిది. అవి కుటుంబ సభ్యుల్లా మారిపోతాయి. అలాంటి ఓ అనుబంధాన్ని కోల్పోయిన బాధను ఇప్పుడు బాలీవుడ్ నటి దిశా పటాని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. తనకు ఎంతో ప్రాణమైన పెంపుడు పిల్లి జాస్మిన్, కుక్క బెల్లా ఒకే రోజు మరణించడంతో ఆమె చేసిన ఎమోషనల్ పోస్ట్ అభిమానుల మనసులను కదిలిస్తోంది.

బెల్లా కోసం రాసిన సందేశం అందరినీ కదిలిస్తోంది. నా బెల్లా… ఈ జీవితాన్ని ఇంత అందంగా, రంగులమయంగా మార్చినందుకు నీకు ధన్యవాదాలు. మా ఇంటిని, నన్ను నీ తల్లిగా ఎంచుకున్నందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని. ప్రేమ అంటే ఏమిటో నువ్వే నాకు నేర్పించావు అంటూ ఆమె రాసిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందేశంలో బెల్లాపై ఆమెకు ఉన్న అపారమైన ప్రేమ, అనుబంధం స్పష్టంగా కనిపిస్తోంది.

ఇక జాస్మిన్ గురించి కూడా దిశా అంతే భావోద్వేగంతో స్పందించింది. తన చిన్న యువరాణిగా పిలుచుకునే ఆ పిల్లి తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిందని పేర్కొంది. దాని స్పర్శ, దాని ప్రేమ, తన చుట్టూ తిరుగుతూ గడిపిన ప్రతి క్షణం ఇప్పుడు కేవలం జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయని తెలిపింది. జాస్మిన్ తనతో లేకపోయినా, తన హృదయంలో మాత్రం ఎప్పటికీ జీవిస్తూనే ఉంటుందని ఆమె రాసిన సందేశం అభిమానులను కన్నీళ్లు పెట్టిస్తోంది.

దిశా పటాని జంతువుల పట్ల ఉన్న ప్రేమ గురించి అభిమానులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన పెంపుడు జంతువులతో సమయం గడపడానికి ఆమె ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చేది. తరచూ వాటితో ఆడుకుంటున్న వీడియోలు, సరదా ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ జంతువులను ప్రేమగా చూసుకోవాలని అభిమానులకు సూచించేది. అందుకే బెల్లా, జాస్మిన్‌లు ఆమె సోషల్ మీడియా ఫాలోవర్లకు కూడా సుపరిచితమే. ఇప్పుడు దిశా చేసిన ఈ పోస్టులకు ప్రస్తుతం వేలాది మంది అభిమానులు స్పందిస్తున్నారు. పెంపుడు జంతువును కోల్పోయిన బాధను తామూ అనుభవించామని, ఆ లోటును ఎవరూ భర్తీ చేయలేరని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆమెకు ధైర్యం చెబుతూ సానుభూతి సందేశాలు పంపిస్తున్నారు.