Slum Dog Release : పూరీ జగన్నాథ్‌ ‘స్లమ్‌డాగ్‌’ సినిమా థియేట్రికల్ రైట్స్ కొనేదెవరు?

Slumdog

Slumdog

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమా వస్తోందంటే ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద అంచనాలు వేరేలా ఉండేవి. కానీ అదంతా గతం. కొంత కాలంగా పూరి ట్రాక్ కొంచెం ఒడిదొడుకుల్లో పడింది. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి భారీ చిత్రాల పరాజయాలు పూరి మార్కెట్‌ను కాస్త దెబ్బతీశాయనేది వాస్తవం. ఈ నేపథ్యంలోనే విజయ్ సేతుపతి, టబు, సంయుక్తా మీనన్ వంటి భారీ తారాగణంతో పూరీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్-ఇండియా చిత్రం ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తయినా ఇంకా థియేటర్లలోకి రాకపోవడం వెనుక ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.

సినిమా బిజినెస్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. పూరీ జగన్నాథ్ గత చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, డిస్ట్రిబ్యూటర్లు ‘స్లమ్‌డాగ్’ సినిమాను తాము అడిగిన రేట్లకు కొనడానికి వెనుకాడుతున్నారు.  నిర్మాతలు ఆశించే రేట్లకు, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల ప్రకారం బయ్యర్లు ఆఫర్ చేస్తున్న రేట్లకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటమే థియేట్రికల్ బిజినెస్ ఇంకా క్లోజ్ కాకపోవడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. దాంతో పాటు ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ డీల్ ఇంకా ఫైనల్ కాలేదనేది కూడా వాస్తవమే. గత చిత్రాల నష్టాల తాలూకు బకాయిలు, ఫైనాన్షియల్ వివాదాల వల్ల తలెత్తిన కొన్ని లీగల్ చిక్కులు ఈ బిజినెస్ కు అడ్డంకిగా మారాయని ఇండస్ట్రీ టాక్. దీనికి తోడు శాటిలైట్, డిజిటల్ సంస్థలు కూడా పూరీ మార్కెట్ ను బేరీజు వేసుకుంటూ బేరసారాలు సాగిస్తుండటంతో డీల్స్ ఆలస్యమవుతున్నాయి. మొత్తానికి, ఆర్థిక వివాదాలు, ఓటీటీ,థియేట్రికల్ బిజినెస్ బేరసారాలు మరియు పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం.. ఈ మూడూ కలిసి ‘స్లమ్‌డాగ్’ విడుదలను ఆలస్యం చేస్తున్నాయి. ఈ ఏడాది ఆఖర్లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.