యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా అనౌన్స్ చేసిన కొన్ని రోజులకే అలనాటి ప్రముఖ సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా ఈ సినిమా కోసం పని చేయబోతున్నారని ప్రకటించారు. సింగీతం దర్శకత్వ పర్యవేక్షణలో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని, స్క్రిప్ట్ విషయంలో కూడా ఆయన సూచనలు, సలహాలు తీసుకుంటారని తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రం నుంచి తప్పుకున్నారట. డైరెక్షన్ టీంతో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ అందుకే కారణమని అంటున్నారు. అయితే ఈ విషయంపై చిత్రబృందం ఇంకా స్పందించలేదు. ఇందులో నిజం ఎంతో తెలీదు కానీ… ప్రభాస్ అభిమానులకు మాత్రం షాకిచ్చే విషయమే. కాగా సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా… అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మించనుంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. జూలైలో సినిమా మొదలుపెడదాం అనుకొనేలోగా కరోనా సెకండ్ వేవ్ వచ్చేసింది. దీంతో ఈ సినిమా షూటింగ్ అక్టోబర్కు వాయిదా పడింది. ఈలోపు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్, యాక్షన్ సీక్వెన్స్, టెక్నికల్ పనులపై నాగ్ అశ్విన్ మరింత దృష్టి సారించాలనుకుంటున్నారట. అక్టోబర్ షెడ్యూల్ లో దీపికా పాల్గొనబోతుందని సమాచారం. ఇక ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’, ‘సలార్’ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ప్రభాస్ పాన్ ఇండియా మూవీ నుంచి తప్పుకున్న సీనియర్ డైరెక్టర్…!?
