Tollywood: పర్సంటేజీ ఇష్యూ.. శిరీష్ రెడ్డికి మైత్రి రవి స్ట్రాంగ్ కౌంటర్

Mythri Ravi

Mythri Ravi

Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలు – ఎగ్జిబిటర్ల మధ్య జరుగుతున్న ‘పర్సెంటేజ్ వర్సెస్ రెంటల్’ వివాదం ఇప్పుడు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో శిరీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరపున నిర్మాత రవిశంకర్ ఘాటుగా సమాధానమిచ్చారు. శిరీష్ రెడ్డి వ్యాఖ్యలపై రవిశంకర్ మండిపడుతూ.. “మీ చేతిలో ప్రస్తుతం పెద్ద సినిమాలు లేవు కాబట్టే, ఇప్పుడే పర్సెంటేజ్ సిస్టమ్ అమలు చేయాలని డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు” అని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం పరిశ్రమలో గందరగోళం సృష్టించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వివాదం మూలాలను గుర్తు చేస్తూ రవిశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “హరిహర వీరమల్లు సినిమా నుంచి ఈ సమస్య మొదలైంది. ఆ తర్వాత మీరు వార్ 2, కూలీ, ఓజీ, అఖండ, నారీ నారీ నడుమ మురారి, చిరంజీవి గారి విశ్వంభర వంటి ఎన్నో భారీ చిత్రాలను రిలీజ్ చేశారు. ఇన్ని సినిమాలు రిలీజ్ చేస్తున్నప్పుడు ఎగ్జిబిటర్ల కష్టాలు మీకు కనిపించలేదా? అప్పుడు పర్సెంటేజ్ సిస్టమ్ ఎందుకు గుర్తుకు రాలేదు?” అని సూటిగా ప్రశ్నించారు.

వివాదం నేపథ్యం ఇదే..
ప్రస్తుతం ఉన్న రెంటల్ (అద్దె) పద్ధతి వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు నష్టపోతున్నాయని, కాబట్టి టికెట్ ఆదాయంలో వాటా (పర్సెంటేజ్) ఇచ్చే విధానం రావాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే థియేటర్లు మూసివేస్తామని హెచ్చరిస్తున్నారు. మొదటి వారంలోనే రికవరీ కావాల్సిన పెద్ద సినిమాలకు పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల భారీ నష్టం వాటిల్లుతుందని మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జూన్ 4న రిలీజ్ కానున్న రామ్ చరణ్ ‘పెద్ది’ (Peddi) సినిమాపై ఈ వివాదం ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలుగు ఫిలిం ఛాంబర్‌లోని పెద్దలు ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారో, ఈ ‘పర్సెంటేజ్’ వార్ ఎటు దారితీస్తుందో అని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.