The Odyssey: ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ది ఒడిస్సీ’. ఈ చిత్రం విడుదలకు ముందే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ హైప్ను సృష్టిస్తోంది. జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్లోనే రికార్డు స్థాయి స్పందన దక్కించుకుంటోంది. గతంలో నోలన్ తెరకెక్కించిన ‘ఒపెన్హైమర్’ భారత్లో భారీ విజయాన్ని సాధించడంతో, ఇప్పుడు ‘ది ఒడిస్సీ’పై కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. భారత్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచే ముఖ్యంగా IMAX వెర్షన్ టికెట్లకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. ట్రైలర్లో కనిపించిన అద్భుతమైన విజువల్స్ కారణంగా ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ తెరపై చూడాలని ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఢిల్లీ, ముంబై, పుణే వంటి ప్రధాన నగరాల్లోని ఐమాక్స్ థియేటర్లు ప్రత్యేకంగా ఉదయం 6 గంటల షోలు కూడా ఏర్పాటు చేశాయి.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న 34 IMAX స్క్రీన్లలోనే 91 వేలకుపైగా టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. బ్లాక్ చేసిన సీట్లతో కలిపి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సుమారు రూ.9.5 కోట్ల గ్రాస్ వసూలైనట్లు తెలుస్తోంది. మరోవైపు తొలి రోజు ప్రదర్శనల కోసం మొత్తం 1.25 లక్షలకు పైగా టికెట్లు బుక్ అయినట్లు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో తొలి రోజు అడ్వాన్స్ గ్రాస్ కలెక్షన్స్ రూ.10 కోట్ల మార్క్ను దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్ను బట్టి చూస్తే ‘ది ఒడిస్సీ’ తొలి రోజు భారత్లో రూ.20 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది విడుదలైన చాలా చిత్రాల కంటే ఈ సినిమా మరింత బలమైన ఓపెనింగ్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్రిస్టోఫర్ నోలన్ గత చిత్రం ‘ఒపెన్హైమర్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుని, నోలన్ కెరీర్లోనే ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ‘ది ఒడిస్సీ’ కూడా అదే జోరును కొనసాగిస్తూ మరో భారీ బ్లాక్బస్టర్గా నిలుస్తుందా? అనే ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది.

