వేతనాలు పెంపు విషయంలో తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక ప్రకటన వెలువరించింది. ఈ మేరకు మీడియాకు ఒక లేఖ రిలీజ్ చేసిన నేపథ్యంలో అందులో ఉన్న అంశాలు మీకోసం. తెలుగు చలన చిత్ర పరిశ్రమ తెలంగాణ / ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇప్పటికే చాలా ఇబ్బందికర పరిస్థితులలో ఉంది. ఇటువంటి సమయంలో వేతనాలు పెంచడం, అందులోనూ కార్మిక శాఖ కమిషనర్ మార్గదర్శకత్వంలో, సామరస్యపూర్వక పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్న సందర్భంలో ఫెడరేషన్ లేబర్ కమిషనర్ మాటను ధిక్కరిస్తూ 03-08-2025వ తేదిన 04-08-2025 తేది నుండి 30% వేతనాలు, ప్రొడ్యూసర్ నుండి సంబంధిత కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన వారికి మాత్రమే, సంబంధిత లెటర్ ఫెడరేషన్ ద్వారా యూనియన్లకు తెలియ చేసిన తరువాత మాత్రమే విధులకు వెళ్ళాలని నిర్ణయించడం చాలా బాధాకరం, ఇది నిజాయితీతో కూడిన చర్చల స్ఫూర్తిని దెబ్బ తీస్తుంది. చిన్న నిర్మాతలు భరించలేని స్థాయిలో వేతనాలు పెంపును యూనియన్స్ డిమాండ్ చేయడం చిన్న నిర్మాతలకు ఆమోదయోగ్యం కాదు, ఆ పెంపు వారు భరించే స్థాయిలో లేదు.
Also Read:Top Headlines @5PM : టాప్ న్యూస్
ప్రతి చిన్న నిర్మాత ఈ పెంపుదలకు వ్యతిరేకంగా ఉండటం గమనార్హం. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో భరించలేని ఈ పెంపును నిర్మాతలందరూ ఏకగ్రీవంగా వ్యతిరేకించడమైనది. కనీస వేతనాల చట్టం ప్రకారం, కనీస వేతనాలు చెల్లించే ఏ కార్మికుడినైనా నియమించుకునే హక్కు నిర్మాతలకు ఉందని కార్మిక శాఖ కమిషనర్ స్పష్టం చేశారు. అంతేకాక కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కూడా నిర్మాతల స్వయంప్రతిపత్తిని సమర్థిస్తూ ఒక ఉత్తర్వును జారీ చేసింది. ఫెడరేషన్ల ఒత్తిడి, పోటీని నిరోధించే పద్ధతులను ఖండిస్తూ, అలాంటి నిబంధనలను అమలు చేయకుండా నిరోధించింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ విషయంలో మిగతా మెట్రోపాలిటన్ పట్టణాలతో పోలిస్తే మన హైదరాబాద్లో తక్కువ. అయిన్పటికి అన్ని యూనియన్ల వారికి ఎక్కువ వేతనాలు చెల్లించడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల చలన చిత్ర పరిశ్రమలో ఇచ్చే వేతనాల కంటే మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పని చేసే కార్మికులకు అధిక వేతనాలు చెల్లించుచున్నాము. ఈ పరిస్థితుల నేపథ్యంలో, తెలుగు ఫిలిం ఛాంబర్ ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేసింది. దీని ప్రకారం నిర్మాతలు ఎవరైతే నైపుణ్యం కలిగిన వర్కర్స్ తామివ్వగలిగే వేతనానికి పనిచేస్తారో వారెవరైనప్పటికి వారి యూనియన్లో ఉన్నా లేకున్నా వాళ్ళతో షూటింగ్స్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతోమంది. ఔత్సాహిక నిపుణులు/కార్మికులు ఇండస్ట్రీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ యూనియన్లలో సభ్యత్వం కొరకు లక్షలాది రూపాయలు డిమాండ్ చేస్తూ వారి ప్రవేశానికి సదరు యూనియన్లు వారు అవరోధం కలిగిస్తున్నారు.
Also Read:WAR 2: ఎన్టీఆర్-హృతిక్ మధ్య ట్వీట్ వార్.. ఎందుకంటే..?
ఇది ఎంతో మంది నైపుణ్యవంతులైన కార్మికుల పొట్ట కొట్టడమే. ప్రతి ప్రాజెక్టు అవసరాలు, వ్యక్తుల సామర్థ్యాల ఆధారంగా కార్మికులతో కలిసి పనిచేసే పూర్తి స్వేచ్చ నిర్మాతలకు ఉంటుంది. ఎవరైనా ఔత్సాహిక నిపుణులు / కార్మికులు సినీ రంగంలో పనిచేయాలంటే వారితో పని చేయించుకోవడానికి నిర్మాతలందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగినది. లక్షలాది రూపాయలు సభ్యత్వం కొరకు కట్టాల్సిన పని లేదు. నైపుణ్యం ఉన్న కార్మికునికి పని కల్పించడమే మా ధ్యేయం అని చాంబర్ తేల్చి చెప్పింది. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి పరిశ్రమలోని అనేక రంగాలలో పని చేసి కళాకారులు, సాంకేతిక నిపుణులు మరియు ఇతర స్టేక్ హోల్డర్పు ఉంటారు. వీరందరితో పని చేస్తూ ఒక సానుకూల నిర్ణయం వైపు మండలి పని చేస్తుంది. నిర్మాత లేనిదే సినిమా పరిశ్రమ లేదు. మన ఫిలిం ఇండస్ట్రీ మనుగడ కోసం నిర్మాత శ్రేయస్సు అతి ముఖ్యమైన విషయం అని కార్మిక సంఘాలు మరొక్కసారి గుర్తించాలని అంటూ కె.యల్. దామోదర్ ప్రసాద్ పేర్కొన్నారు.
