Shweta Singh: సుశాంత్‌ను ఇప్పటికీ కలల్లో చూస్తున్నా.. ధోనీ కనీసం పరామర్శించలేదు.. సోదరి శ్వేత భావోద్వేగ వ్యాఖ్యలు

Sushant Singh Rajput

Sushant Singh Rajput

Shweta Singh: కాలం గడిచిపోతుంది. కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం మనసును ఎప్పటికీ వదిలిపెట్టవు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి ఆరేళ్లు పూర్తయినా, ఆయన చుట్టూ ఉన్న ప్రశ్నలు ఇంకా పూర్తిగా ముగియలేదు. 2020లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అభిమానులు ఇప్పటికీ ఆయనను గుర్తు చేసుకుంటుండగా, తాజాగా సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి చేసిన భావోద్వేగ వ్యాఖ్యలతో చాలా మంది ఎమోషనల్ అయ్యారు. ఒక పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆమె, తనకు ఇప్పటికీ కలల్లో, ధ్యానంలో సుశాంత్ కనిపిస్తుంటాడని చెప్పడంతో ఆమె మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

సూపర్‌టాక్స్ బై దిమూవింగ్‌షిప్ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన శ్వేత, సుశాంత్ మరణించిన తర్వాత తనకు జరిగిన ఒక అనుభవాన్ని పంచుకున్నారు. తన సోదరుడి చితాభస్మాన్ని నిమజ్జనం చేసేందుకు పాట్నాకు వెళ్లిన సమయంలో, ఆ రాత్రి సుశాంత్ తన కలలో కనిపించారని చెప్పారు. గంటల తరబడి తనతో మాట్లాడినట్లు, తన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు, చివర్లో కౌగిలించుకుని బుగ్గపై ముద్దు పెట్టినట్లు ఆమె భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు. ఆ క్షణంలో ఆయన శ్వాస కూడా తాను అనుభూతి చెందినట్లు చెప్పిన శ్వేత, ఆ అనుభవం తనకు ఓదార్పునిచ్చిందని వివరించారు.

సుశాంత్ మరణవార్త తెలిసిన రోజు కూడా తన జీవితంలో మరచిపోలేని క్షణమని ఆమె చెప్పారు. ఆ సమయంలో తాను అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్నానని, రాత్రి వేళ ఆ వార్త విన్న వెంటనే శరీరం మొద్దుబారిపోయిందని గుర్తుచేసుకున్నారు. మొదట కొద్దిసేపు ప్రశాంతంగా ఉన్నా, తర్వాత అదుపు తప్పి ఏడ్చానని తెలిపారు. కరోనా పరిస్థితుల కారణంగా భారతదేశానికి రాలేకపోవడం, తన సోదరుడికి చివరి వీడ్కోలు చెప్పలేకపోవడం ఇప్పటికీ తనను బాధిస్తోందని అన్నారు. సుశాంత్‌తో తన బంధం ఎంత ప్రత్యేకమో కూడా శ్వేత వివరించారు. ఆయన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో తరచూ పంచుకోవడం వెనుక కారణం కూడా అదే అని చెప్పారు. సుశాంత్ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ జీవించాలని తాను కోరుకుంటున్నానని పేర్కొన్నారు. తనకు ఆయన భౌతికంగా లేకపోయినా, ఆధ్యాత్మికంగా తనతోనే ఉన్నట్లు అనిపిస్తుందని ఆమె భావోద్వేగంగా చెప్పారు.

ఈ ఇంటర్వ్యూలో మరో అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. సుశాంత్ కెరీర్‌లో మలుపు తీసుకొచ్చిన మూవీ ‘ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’. ఈ సినిమాలో మహేంద్ర సింగ్ ధోనీ పాత్రలో ఆయన నటన విశేష ప్రశంసలు అందుకుంది. అయితే సుశాంత్ మరణం తర్వాత ధోనీ తమ కుటుంబాన్ని సంప్రదించలేదని శ్వేత వెల్లడించారు. మరోవైపు కంగనా రనౌత్‌తో పాటు మరికొందరు సినీ ప్రముఖులు తమను పరామర్శించారని ఆమె చెప్పారు. సోదరుడిని కోల్పోయిన బాధ నుంచి బయటపడే తన ప్రయాణంలో కలలు, ధ్యానం ద్వారా ఆయనను అనుభూతి చెందుతున్నానని చెప్పిన ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.