మెగా పవర్స్టార్ రామ్చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం తాలూకూ ప్రమోషన్స్ స్పీడ్ను మేకర్స్ నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ ఈవెంట్కు చిత్ర యూనిట్ ముహూర్తం ఖరారు చేసింది.
ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ను ఎన్నడూ లేని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ఈ మెగా వేడుకకు ఆతిథ్యం ఇవ్వనుంది. జూన్ 1వ తేదీన జరగబోయే ఈ గ్రాండ్ ఈవెంట్కు మెగా పవర్స్టార్ రామ్చరణ్తో పాటు చిత్ర యూనిట్ మొత్తం హాజరుకానుంది. దీనికి తోడు టాలీవుడ్కు చెందిన పలువురు అగ్ర నటీనటులు, దర్శకులు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఈ సినిమాకు ప్రత్యేక షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు అనుమతులు మంజూరు చేయడంతో ‘పెద్ది’ బజ్ ఒక్కసారిగా రెట్టింపయింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో సాంగ్స్ ఇప్పటికే చార్ట్బస్టర్స్గా నిలవగా ఈ ఈవెంట్లో విడుదల చేయబోయే సెకండ్ ట్రైలర్ సినిమా రేంజ్ను డిసైడ్ చేయనుంది. లక్షలాది మంది అభిమానుల మధ్య జరగనున్న ఈ వేడుకకు విజయవాడ మునిసిపల్ స్టేడియం ముస్తాబవుతోంది.
