Boycott Peddi: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’. ఈ భారీ ప్రాజెక్ట్ వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి. తాజాగా చిత్రం రిలీజ్కు ముందు చిక్కుల్లో పడింది. ఈ సినిమాను తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శించబోమని ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొదట 23 థియేటర్లతో ప్రారంభమైన ఈ ‘బాయ్కాట్’ నిరసన, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సింగిల్ స్క్రీన్లకు విస్తరించడం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది.
వివాదానికి అసలు కారణం ఇదే..
ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్లో ఎగ్జిబిటర్లు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కోవిడ్ సంక్షోభం తర్వాత సింగిల్ స్క్రీన్ థియేటర్లు తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్నాయని, ప్రస్తుతం కొనసాగుతున్న ‘ఫిక్స్డ్ రెంటల్’ (స్థిర అద్దె) విధానం వల్ల తాము మనుగడ సాగించలేకపోతున్నామని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వాళ్లు పలు కీలక డిమాండ్స్ చేశారు. మల్టీప్లెక్స్ల తరహాలోనే సింగిల్ స్క్రీన్లకు కూడా వసూళ్లలో వాటా (పర్సంటేజ్) ఇచ్చే విధానాన్ని అమలు చేయాలని చెబుతున్నారు. ఫిక్స్డ్ రెంటల్ వల్ల సినిమా ఆడినా ఆడకపోయినా థియేటర్లు మూసివేసే పరిస్థితి వస్తోందని, దీనిని వెంటనే మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
జూన్ 4న విడుదల కానున్న ‘పెద్ది’ చిత్రానికి నిజాం ఏరియాలోని సింగిల్ స్క్రీన్లు అత్యంత కీలకం. మాస్ ఆడియన్స్ను ఆకర్షించే ఈ థియేటర్లు సినిమాను బాయ్కాట్ చేయడం వల్ల ఓపెనింగ్ వసూళ్లపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మాస్ సెంటర్లలో రామ్ చరణ్ సినిమాకు ఉండే క్రేజ్ దృష్ట్యా, ఈ వివాదం చిత్ర యూనిట్కు పెద్ద తలనొప్పిగా మారింది. చిత్ర నిర్మాతలు (మైత్రీ మూవీ మేకర్స్) రెవెన్యూ షేరింగ్ మోడల్పై ఇంకా సానుకూల నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమలోని పెద్దలు రంగంలోకి దిగి, ఎగ్జిబిటర్లకు – నిర్మాతలకు మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమాచారం. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో, త్వరలోనే ఒక సయోధ్య కుదురుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మొత్తానికి ‘పెద్ది’ విడుదల వివాదం టాలీవుడ్లో నిర్మాతలు-థియేటర్ల యజమానుల మధ్య ఉన్న దీర్ఘకాలిక ఆర్థిక విభేదాలను మరోసారి బహిర్గతం చేసినట్లు అయ్యిందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
