మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్కు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కమర్షియల్ హంగులతో పాటు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ ఆడియన్స్కు సైతం ఆయన బాగా కనెక్ట్ అయ్యారు. ప్రస్తుతం రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’లోనూ ఆయన ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ లోపే, పృథ్వీరాజ్ హీరోగా నటించిన సరికొత్త మైండ్ బ్లోయింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ (I, Nobody) తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ మోస్ట్ అవేటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు ‘శ్రీ స్రవంతి మూవీస్’, ‘మైత్రీ మూవీస్’ చేతులు కలిపాయి. జూలై 9న మలయాళంలో విడుదలవుతున్న ఈ చిత్రం, మరుసటి రోజు అంటే జూలై 10న భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. అయితే, తెలుగులో ఈ సినిమాపై ఉన్న విపరీతమైన అంచనాల నేపథ్యంలో.. జూలై 9వ తేదీనే రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు నిర్మాతలు.
అసలు కథేంటంటే..?
రాజు అనే ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగి జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక భారీ బ్యాంక్ రాబరీ కేసులో రాజు అనూహ్యంగా ఇరుక్కుంటాడు. తానే ఆ దోపిడీ చేశాడనే ఆరోపణలు రావడంతో, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి అతను ఊహించని విధంగా హింసాత్మక మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. అసలు రాజు నిజంగానే నేరస్థుడా? లేక ఎవరైనా అతన్ని ఇరికించారా? ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? అనే ఆసక్తికరమైన అంశాలతో దర్శకుడు నిస్సాం బషీర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. నేషనల్ అవార్డ్ విన్నర్ పార్వతి తిరువోతు ఇందులో కీలక పాత్ర పోషించగా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటన సినిమాకే హైలైట్గా నిలవనుందని టాక్. హకీమ్ షాజహాన్, అశోకన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సమీర్ అబ్దుల్ కథ, స్క్రీన్ప్లే అందించారు. జేక్స్ బిజాయ్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వగా.. దినేష్ పురుషోత్తమన్ కెమెరా బాధ్యతలు నిర్వహించారు. ఈ వేసవి ముగింపులో ప్రేక్షకులకు ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ అనుభూతిని ఇవ్వడానికి ఈ చిత్రం థియేటర్లలోకి వస్తోంది.

