Rashmika Mandanna: భారతీయ సంగీత ప్రపంచంలో తన గానంతో యుగాలను మైమరపించిన కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి, భారతరత్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. ‘M.S. A Legacy On Screen’ పేరిట తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక బయోపిక్ ప్రారంభోత్సవం చెన్నైలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు లోకనాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి తొలి క్లాప్ కొట్టారు. సంగీత ప్రపంచం గర్వించే దిగ్గజ గాయనిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్పై దేశవ్యాప్తంగా సినీ, సంగీత వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈవెంట్లో మాట్లాడిన కమల్ హాసన్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. కోట్లాది మంది హృదయాలను భక్తిభావంతో కదిలించిన ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారి అద్వితీయ జీవితాన్ని సినిమాగా తీసుకురావడం అభినందనీయమన్నారు. అలాంటి మహోన్నత ప్రాజెక్ట్ లాంచ్లో తాను భాగం కావడం పూర్వజన్మ సుకృతం, దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నానని చెప్పారు.
సుబ్బులక్ష్మి గారి పాత్రను పోషిస్తున్న రష్మిక మందన్నను ప్రత్యేకంగా అభినందించిన కమల్.. ఇంతటి ఐకానిక్, లెజెండరీ పాత్రను పోషించడానికి ఎంతో ధైర్యం కావాలని, అంచనాలకు భయపడకుండా తనదైన సహజ నటనతో ఈ పాత్రకు నిండుదనం తీసుకురావాలని ధైర్యం చెప్పారు. ‘మళ్ళీ రావా’, ‘జెర్సీ’ చిత్రాలతో భావోద్వేగాలను అద్భుతంగా పండించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్కు దర్శకత్వం వహిస్తున్నారు. సుబ్బులక్ష్మి గారి బాల్యం, ఆమె సంగీత ప్రస్థానం, జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతితో పాటు ఆమె వ్యక్తిగత జీవితంలోని అరుదైన కోణాలను హృద్యంగా ఆవిష్కరించేలా ఈ సినిమా స్క్రిప్ట్ను ఆయన రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ను దేశంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్స్ (అల్లు అరవింద్), రాక్లైన్ ఎంటర్టైన్మెంట్స్ (రాక్లైన్ వెంకటేష్), బన్నీ వాస్ వర్క్స్ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, భారీ బడ్జెట్తో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సరికొత్త రూపంలో రష్మిక కనిపించబోతుండటం, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఎమోషనల్ బ్రిలియన్స్ తోడవడంతో ‘M.S. A Legacy On Screen’ భారతీయ చలనచిత్ర చరిత్రలో మరో మైలురాయిగా నిలవడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

